prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 22 February 2026, 6:11 am Digital Edition : PRAJA KSHETRAM

అక్రమ సంబంధం ఎఫెక్ట్… ప్రియుడితో కలిసి భర్తను కడతేర్చిన భార్య

అక్రమ సంబంధం ఎఫెక్ట్… ప్రియుడితో కలిసి భర్తను కడతేర్చిన భార్య

  • రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఘటన
  • నిద్రిస్తుండగా దిండుతో ఊపిరాడకుండా చేసి భర్తను చంపిన భార్య
  • భార్య రాజేశ్వరి, ప్రియుడు శరత్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలింపు
  • మృతుడి తల్లి ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన దారుణ ఘటన

    చేవెళ్ళ ఫిబ్రవరి 22(ప్రజాక్షేత్రం):సీఐ వెల్లడించిన వివరాల ప్రకారం.. శంకర్‌పల్లి మండలం పర్వేద గ్రామానికి చెందిన నారగూడం కృష్ణ (35), జీడిమెట్లకు చెందిన రాజేశ్వరిని 2018లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. చేవెళ్లలోని చంద్రారెడ్డినగర్‌లో నివసిస్తూ కూలీ పనులు చేసుకుంటున్నారు. ఆరు నెలల క్రితం రాజేశ్వరికి శరత్‌ అనే యువకుడితో ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం ఏర్పడి, అది వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయంపై భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలో కృష్ణను అడ్డు తొలగించుకోవాలని రాజేశ్వరి, శరత్ నిర్ణయించుకున్నారు. గురువారం రాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చిన కృష్ణతో రాజేశ్వరి గొడవపడింది. అతను నిద్రలోకి జారుకున్నాక, ప్రియుడు శరత్‌కు ఫోన్ చేసి పిలిపించింది. ఇద్దరూ కలిసి కృష్ణ కాళ్లు, చేతులు కట్టేసి, ముఖంపై దిండు పెట్టి ఊపిరాడకుండా చేశారు. అనంతరం శరత్ అతని ఛాతీపై బలంగా కొట్టడంతో కృష్ణ మృతి చెందాడు. హత్య తర్వాత ఏమీ తెలియనట్లు నటించిన రాజేశ్వరి, శుక్రవారం ఉదయం తన భర్త పలకడం లేదంటూ ఆసుపత్రికి తీసుకెళ్లింది. అయితే, అప్పటికే కృష్ణ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కృష్ణ మృతిపై అనుమానం వ్యక్తం చేసిన అతని తల్లి అంజమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాజేశ్వరిని విచారించగా అసలు నిజం ఒప్పుకుంది. ఆమె ఇచ్చిన సమాచారంతో ప్రియుడు శరత్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు నిందితులను శనివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు.