prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 17 February 2026, 6:31 pm Digital Edition : PRAJA KSHETRAM

డ్రైనేజీ నిర్మించారు.. పైకప్పు మరిచారు

డ్రైనేజీ నిర్మించారు.. పైకప్పు మరిచారు

శంకర్ పల్లి ఫిబ్రవరి 17(ప్రజాక్షేత్రం): శంకర్ పల్లి మున్సిపల్ లోని ఫత్తేపూర్ 8వ వార్డు నిర్మించిన డ్రైనేజీ పనులకు సంవత్సరం కాలం పూర్తికావస్తున్నా, ఇప్పటికీ పైకప్పు (స్లాబ్) నిర్మాణం చేపట్టకపోవడం స్థానికుల్లో ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది. డ్రైనేజీ నిర్మాణం చేపట్టి పైకప్పు వదిలేయడంతో ఆయా ప్రాంతాల ప్రజలు రోజూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డ్రైనేజీ పైకప్పు లేకపోవడంతో మురుగునీటి దుర్వాసన వ్యాపించడమే కాకుండా, దోమలు పెరిగి ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు రాకపోకల్లో ప్రమాదానికి గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే డ్రైనేజీ నిర్మాణం పూర్తయినప్పటికీ, పైకప్పు నిర్మాణం ఎందుకు చేపట్టలేదన్న దానిపై మున్సిపల్ అధికారులు స్పష్టమైన సమాధానం ఇవ్వకపోవడం పట్ల ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. నిధుల లేమా? నిర్లక్ష్యమా? లేక పాలకుల ఆసక్తి లోపమా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. తమ ఇబ్బందులు వివరించాలని 8వ వార్డు ప్రజలు చర్చించుకుంటున్నారు. డ్రైనేజీ పైకప్పు పనులు వెంటనే చేపట్టి, ప్రజలకు నిత్య సమస్యగా మారిన ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు మున్సిపాలిటీ అధికారులను, ప్రజాప్రతినిధులను డిమాండ్ చేస్తున్నారు.