ప్రజాతీర్పును గౌరవిస్తాం..ఓడినా, గెలిచినా మేము ప్రజల పక్షమే
- బాన్సువాడ బీఆర్ఎస్ నాయకులు
కామారెడ్డి జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 14(ప్రజాక్షేత్రం):కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, ఓడినా, గెలిచినా తాము ఎప్పటికీ ప్రజల పక్షమేనని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. శనివారం పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరులతో నిర్వహించారు. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ బాన్సువాడ మున్సిపాలిటీలో మూడు బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచారు. అనేక వార్డుల్లో అతి తక్కువ ఓట్ల తేడాతో ఓడిపోయారని తెలిపారు. ఎమ్మెల్యే పోచారం నివాసం ఉండే వార్డులో బిఆర్ఎస్ ఘనవిజయం సాధించిందని షేక్ జుబేర్ అన్నారు. అధికార పార్టీ అభ్యర్థులకు బీఆర్ఎస్ అభ్యర్థులు గట్టి పోటీ ఇచ్చారని పేర్కొన్నారు. అధికార దుర్వినియోగం, మద్యం, డబ్బు పంపకాలతో కాంగ్రెస్ పార్టీ ఓటర్లను ప్రలోభాలకు గురిచేసిందని ఆరోపించారు. అయినప్పటికీ మెజార్టీ సీట్లు సాధించలేకపోయిందని తెలిపారు. పట్టణంలో ప్రజా సమస్యలు పరిష్కారం కోసం బీఆర్ఎస్ నిరంతరం పోరాడుతూనే ఉంటుందని, పార్టీ అభ్యర్థులకు ఓట్లు వేసిన అన్ని వార్డుల ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో నార్ల రత్న కుమార్, అంజిరెడ్డి, షేక్ జుబేర్, ఫెరోజ్, ఖలీల్, మాక్బూల్, రమేష్ యాదవ్ తదితరులు ఉన్నారు.