భీంగల్ మున్సిపల్ చైర్ పర్సన్ గా బోదిరె నాగమణి, వైస్ చైర్ పర్సన్ సంటి లతతో పాటు కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం

భీంగల్ ఫిబ్రవరి 16(ప్రజాక్షేత్రం):భీంగల్ మున్సిపాలిటీ పరిధిలోని 12 వార్డులలో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 8 మంది,బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థులు 4 కౌన్సిలర్ స్థానాలను కైవసం చేసుకున్నారు. భీంగల్ మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన కౌన్సిలర్లలో నలుగురు మహిళలు ఉండడంతో మున్సిపల్ చైర్ పర్సన్,వైస్ చైర్ పర్సన్ పదవికి తీవ్ర పోటీ ఎదురైంది. గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థులు సోమవారం ఉదయం క్యాంపు నుండి బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ముత్యాల సునిల్ కుమార్ ఆధ్వర్యంలో నేరుగా భీంగల్ మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు.భీంగల్ మున్సిపాలిటీ ప్రత్యేక సమావేశం సోమవారం ప్రశాంతంగా ముగిసింది.భీంగల్ జడ్పీ సీఈఓ సాయ గౌడ్ పి.ఓగా బాధ్యతలు నిర్వర్తించారు.రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన మేరకు ఉదయం 11 గంటలకు ప్రత్యేక సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఆయా పార్టీల వారీగా సభ్యులు సమావేశ మందిరాల్లోకి చేరుకోగా తెలుగు అక్షరమాలను అనుసరిస్తూ వరుస క్రమంలో నూతనంగా ఎన్నికైన సభ్యులతో మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్, తహసిల్దార్, ఎంపీడీవో పాటు అధికారులు ప్రమాణ స్వీకారం చేయించారు. క్షేత్రస్థాయిలో స్వీయ పర్యవేక్షణ జరుపుతూ ఎలాంటి గందరగోళానికి తావు లేకుండా ఎన్నికల సంఘం నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తూ ఎన్నికల ప్రక్రియను జరిపించారు.మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మున్సిపల్ చైర్మన్ గా 6 వ వార్డు కౌన్సిలర్ బోదిరె నాగమణి, వైస్ చైర్మన్ గా 10 వార్డు కౌన్సిలర్ సంటి లతను ఎన్నుకున్నారు.చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ ఎన్నికను పురస్కరించుకొని ఎలాంటి అవంచనీయ సంఘటనలకు తావు లేకుండా మున్సిపల్ కార్యాలయం వద్ద కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తును సీఐ సత్యనారాయణ గౌడ్, ఎస్ ఐ తిరుపతి ఏర్పాటు చేశారు.