మహాశివరాత్రికి మరకత శివాలయాన్ని దర్శించుకున్న భక్తులు
-స్వామివారి దర్శనానికి మూడు గంటల సమయం
శంకర్పల్లి ఫిబ్రవరి 15(ప్రజాక్షేత్రం):శంకర్పల్లి మండల పరిధిలోని చందిప్ప గ్రామ శివారులో గల 11 వ శతాబ్దానికి చెందిన మహిమగల శ్రీ బ్రహ్మసూత్ర మరకత శివాలయంలో మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆదివారం వేకువ జామున ఉదయం ఒంటిగంట నుంచి స్వామి వారిని దర్శించుకునేందుకు పెద్దఎత్తున తరలివచ్చిన భక్తులతో ఆలయం కిటకిటలాడింది. ఉదయం 6 గంటల వరకే అభిషేకాలకు అనుమతిని ఇచ్చారు. అనంతరం స్వామివారి దర్శనం కోసం భక్తులు క్యూ లైన్ లో బారులు తీరారు. గర్భాలయ దర్శనాలకు అనుమతించడంతో విడతలవారీగా దర్శనాల టిక్కెట్ల కోసం యాత్రికులు పోటీ పడ్డారు. దీంతో ఆలయ ప్రాంగణంలోని అన్ని క్యూలైన్లు భక్తులతో నిండిపోయాయి. అదే విధంగా ఉచిత దర్శనానికి సుమారు మూడు గంటలకుపైగా సమయం పట్టింది. కళారాధన కార్యక్రమాల్లో చిన్నారులు చేసిన నృత్యాలు అందరినీ అలరించాయి.

రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్ తో పాటు వివిధ ప్రాంతాల నుంచి సుమారు లక్ష మందికి పైగా భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారని ఆలయ వర్గాలు తెలిపాయి. క్యూలైన్లలో ఉన్న భక్తులకు ఆలయ అధికారులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తాగు నీరు, అల్పహారాన్ని అందించారు. చేవెళ్ల కోర్టు జడ్జి దంపతులు, దేశముఖ్ అనూష అవనందరెడ్డి, తహసిల్దారు సురేందర్ దంపతులు, సిఐలు శ్రీనివాస్ గౌడ్, సతీష్, క్రాంతి కుమార్ దంపతులు, రంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీ జ్యోతి, భీమ్ భరత్, యాంకర్, వైయస్సార్ సిపి అధికార ప్రతినిధి శ్యామల, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తనయుడు విక్రం రెడ్డి స్వామి వారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు. చేవెళ్ల, శంకర్పల్లి, నార్సింగ్ పోలీస్ స్టేషన్ ల నుండి 70 మంది పోలీసు సిబ్బంది ఆలయ ఆవరణలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఆలయ గౌరవ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు (వీడియో రావు), ప్రచార కమిటీ చైర్మన్ దయాకర రాజు స్వామి, చైర్మన్ గోపాల్ రెడ్డి, వైస్ చైర్మన్ శేఖర్, కోశాధికారి జనార్ధన్, అన్నదాన కమిటీ చైర్మన్ దర్శన్ గౌడ్, మాజీ చైర్మన్ సదానందం గౌడ్, డబ్బింగ్ ఆర్టిస్ట్, రైటర్ కృష్ణవేణి శఠకోపన్, సర్పంచ్ మల్లికార్జున్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు ఉన్నారు.



