రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత.
– డ్రైవింగ్ చేసే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ సెల్ ఫోన్ వినియోగించరాదు.
– రోడ్డు భద్రతపై డ్రైవర్లకు అవగాహన సదస్సు.
– ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు.
శంకర్ పల్లి ఫిబ్రవరి 28(ప్రజాక్షేత్రం):రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, రోడ్డు ప్రమాదాల నివారణ మరియు సురక్షిత ప్రయాణం పై ప్రతి ఒక్కరు అవగాహనా కలిగి ఉండాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న “అరైవ్ ఆలైవ్” రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా శనివారం ఫ్యూచర్ సిటీ కమిషనరేట్, రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలంలోని మోకిలా పోలీస్ స్టేషన్ పరిధిలో సిఐ వీరబాబు ఆధ్వర్యంలో డ్రైవర్లకు రోడ్డు భద్రత మరియు సురక్షిత ప్రయాణం పై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా సిఐ వీరబాబు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు కుటుంబాలను తీవ్రంగా దెబ్బతీస్తాయని, జాగ్రత్తలతోనే ప్రమాదాలు నివారించవచ్చని అన్నారు.ప్రతి ఒక్క డ్రైవర్లు ట్రాఫిక్ నియమాలు పాటించాలని సూచించారు. స్కూల్, కాలేజీ బస్సులు సురక్షిత స్థితిలో ఉన్నాయో లేదో తరచూ తనిఖీ చేయాలని సూచించారు. డ్రైవర్లకు క్రమం తప్పకుండా కంటి పరీక్షలు సాధారణ ఆరోగ్య పరీక్షలను కూడా నిర్వహించాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల మీతో పాటు ఎదుటి వాళ్ళకు కూడా ప్రమాదాలు జరగవచ్చని గుర్తు చేశారు. డ్రైవింగ్ చేసే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ సెల్ ఫోన్ వినియోగించరాదని అన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపర్యమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. విద్యార్థుల ప్రాణాలు ఎంతో విలువైన అని ప్రతి విద్యా సంస్థ భద్రత నిబంధనలను పాటిస్తూ విద్యార్థులకు సురక్షిత ప్రయాణం కల్పించాలని పోలీసులు కోరారు.