prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 27 February 2026, 5:43 pm Digital Edition : PRAJA KSHETRAM

వనపర్తి మున్సిపల్సీఈఓ సరస్వతి బాయి ని తక్షణం బదిలీ చేయాలి.

వనపర్తి మున్సిపల్
సీఈఓ సరస్వతి బాయి ని తక్షణం బదిలీ చేయాలి.

– మున్సిపల్ కమిషనర్‌ను కలిసిన ఆర్పీలు

    – వేధింపులపై వినతిపత్రం.

    వనపర్తి, ఫిబ్రవరి 27(ప్రజాక్షేత్రం):పట్టణంలోని పలు వార్డుల్లో విధులు నిర్వహిస్తున్న ఆర్పీలను మానసికంగా వేధిస్తున్న సీఈఓ సరస్వతి బాయ్‌ను వెంటనే బదిలీ చేయాలని ఆర్పీలు డిమాండ్‌ చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లును కలిసి తమ ఆవేదన వ్యక్తం చేస్తూ వినతిపత్రం సమర్పించారు.
    ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… గత కొంతకాలంగా సీఈఓ సరస్వతి 2, 5, 14, 15, 18, 19, 22వ వార్డుల్లో పనిచేస్తున్న ఆర్పీలను విధి నిర్వహణలో తీవ్రంగా వేధిస్తున్నారని ఆరోపించారు. అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్లినా, శుభకార్యాలకు హాజరైనా, అత్యవసర కుటుంబ పరిస్థితుల్లో బయటకు వెళ్లినా ముందుగా తన అనుమతి తీసుకోవాలని ఒత్తిడి తెస్తున్నారని వాపోయారు.
    చావుబతుకుల సమయంలో కూడా సెల్ఫీ తీసి పంపాలని, ఆసుపత్రికి వెళితే బిల్లులు చూపించాలని అడిగి మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తోందని తెలిపారు. తోటి అధికారులతో మాట్లాడినా అక్రమ సంబంధాల ముద్ర వేస్తూ అవమానిస్తున్నారని ఆరోపించారు. ఈ వేధింపులు తట్టుకోలేక కొందరు ఆత్మహత్య చేసుకునే స్థితికి చేరుకున్నారని ఆర్పీలు బోరున విలపించారు. సీఈఓ ప్రవర్తన కారణంగా పలువురికి బీపీ, షుగర్ వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. ఆర్పీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న సరస్వతి బాయ్‌ను తక్షణమే ఇతర ప్రాంతానికి బదిలీ చేయాలని కమిషనర్‌ను కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ గంధం మదన్, మెకానిక్ శీను ఆర్పీలకు మద్దతు తెలిపారు. ఆర్పీల యూనియన్ జిల్లా అధ్యక్షురాలు గంధం సరస్వతి, శ్రీలక్ష్మి, బషీరాబేగం, ఖాతూన్, ముంత జయమ్మ, సువర్ణ, శిరీష, వాణి, కమలమ్మ, సాజిదా బేగం, రసీదా బేగం తదితరులు పాల్గొన్నారు.