శ్రీ బ్రహ్మసూత్ర మరకత శివాలయ దివ్య క్షేత్రంలో హీరో రాజేంద్రప్రసాద్ ప్రత్యేక పూజలు
శంకర్పల్లి ఫిబ్రవరి 12(ప్రజాక్షేత్రం):కేంద్ర ప్రభుత్వం గతవారం హీరో డా. రాజేంద్రప్రసాద్ కు పద్మశ్రీ అవార్డు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆలయ ప్రచార కమిటీ చైర్మన్ దయాకర్ స్వామి ఆహ్వానం మేరకు గురువారం శంకర్పల్లి మండల పరిధిలోని చందిప్ప గ్రామ శివారులో అష్టమ మోక్షపురిగా ప్రసిద్ధి చెందుతున్న చాళుక్య రాజుల కాలానికి చెందిన 11వ శతాబ్దపు శ్రీ రాజరాజేశ్వరి సమేత మహిమగల బ్రహ్మసూత్ర మరకత లింగేశ్వర దివ్య క్షేత్రంలో టాలీవుడ్ సీనియర్ నటుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత, డా. రాజేంద్రప్రసాద్ స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేసి క్షేత్రపాలకుడు కాలభైరవుడిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు సాయిశివ, ప్రమోద్, వీరేష్ లు హీరోకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ ఆవరణలో గల గణేష్ మండపం వద్ద ఆలయ కమిటీ సభ్యులు హీరోను స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి, స్వామివారి చిత్రపటాన్ని బహుకరించారు. హీరో మాట్లాడుతూ పురాతన మరకత లింగాన్ని దర్శించుకోవడం ఎంతో ప్రశాంతతను ఇచ్చిందని, మరల కుటుంబ సభ్యులతో శివాలయానికి వస్తానని చెప్పారు. ఆలయంలో ఒకరోజు అన్నదానానికి హీరో బాలయ్య కమిటీకి నగదును అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త వీడియో రావు, ఆలయ చైర్మన్ గోపాల్ రెడ్డి, వైస్ చైర్మన్ శేఖర్, ప్రధాన కార్యదర్శి జనార్ధన్, గౌరవ అధ్యక్షుడు సదానందం గౌడ్, డబ్బింగ్ ఆర్టిస్ట్ రైటర్ కృష్ణవేణి, కమిటీ సభ్యులు గోపాల్, హన్మంతు, గ్రామ సర్పంచ్ మల్లికార్జున్, ఉప సర్పంచ్ నర్సింలు, మాజీ సర్పంచ్ శ్రీనివాస్ ఉన్నారు.