సుభాష్ నగర్ గంపల బస్తీలో స్క్రాప్ గోదాంలో మంటలు
– ఫైర్ సేఫ్టీ ఎక్కడ? అగ్ని ప్రమాదంతో బయటపడిన లోపాలు
– ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించారా?గంపల బస్తీ అగ్ని ప్రమాదం ప్రశ్నలు లేవనెత్తింది
కుత్బుల్లాపూర్, ఫిబ్రవరి 26(ప్రజాక్షేత్రం):జీడిమెట్ల పీఏస్ పరిధిలోని సుభాష్ నగర్ గంపల బస్తీలో గురువారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ స్క్రాప్ గోదాంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో సమీపంలోని చిన్న పరిశ్రమల యజమానులు, కార్మికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కాసేపట్లోనే మంటలు ఎగసిపడటంతో ప్రాంతంలో దట్టమైన పొగ కమ్ముకుంది.
సమాచారం అందుకున్న వెంటనే జీడిమెట్ల అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని 3 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు 3 గంటల పాటు శ్రమించారు. పోలీసులు కూడా అక్కడికి చేరుకుని భద్రతా చర్యలు చేపట్టి జనాన్ని దూరంగా నిలిపారు. ప్రస్తుతం మంటలు అదుపులోకి వస్తున్నట్లు అధికారులు తెలిపారు. అయితే ఆస్తి నష్టం ఎంత మేరకు జరిగిందన్నది ఇంకా స్పష్టత రాలేదు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ప్రమాదానికి గల ఖచ్చిత కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.
ఇండస్ట్రియల్ సేఫ్టీపై ప్రశ్నలు….
పరిశ్రమలు, స్క్రాప్ గోదాంలో గుంపులుగా ఉన్న ఈ ప్రాంతంలో భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారా? ఫైర్ సేఫ్టీ పరికరాలు సరిపడా ఉన్నాయా? అనే ప్రశ్నలు స్థానికుల్లో చర్చనీయాంశంగా మారాయి. జీడిమెట్ల, దూలపల్లి పారిశ్రామిక వాడలో సరియైన ఫైర్ సేఫ్టీ లేకుండా అనేక పరిశ్రమలు నడుస్తున్న జీడిమెట్ల ఫైర్ సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ లేకపోవడమే దీనికి ప్రధాన కారణం అని స్థానికులు చెప్పుకొస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ తరచూ ఉంటేనే ఇలాంటి అగ్ని ప్రమాదాలు ఉండవని స్థానికులు చెప్తున్నారు.

