అనుమతి గృహానికి…నిర్మాణం వ్యాపారానికి!
- కాప్రా సర్కిల్లో అక్రమాలకు అడ్డుకట్ట ఎప్పుడు?
- అధికారుల వైఖరి “కర్ర విరగకుండా పాము చావాలి”
• రాజకీయ అండతో దూకుడు ఫిర్యాదులకూ స్పందనలేక స్థానికుల ఆవేదన
కాప్రా,మార్చి 17(ప్రజాక్షేత్రం):కాప్రా సర్కిల్ పరిధిలోని డా.ఏఎస్ రావు నగర్ డివిజన్లోని పద్మశాలి టౌన్షిప్లో నిబంధనలను బేఖాతరు చేస్తూ నిర్మాణాలు కొనసాగుతున్నాయి. స్టిల్ట్ ప్లస్–2 రెసిడెన్షియల్ అనుమతి తీసుకున్న నిర్మాణదారుడు, అదే అనుమతితో మినీ కమర్షియల్ కాంప్లెక్స్ను నిర్మిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. స్థానికుల వివరాల ప్రకారం, అనుమతులు కేవలం నివాస గృహానికి మాత్రమే ఉన్నప్పటికీ, భవనాన్ని వ్యాపార అవసరాలకు అనుగుణంగా నిర్మిస్తున్నారు. దీంతో కాలనీలో ట్రాఫిక్ సమస్యలు,పార్కింగ్ ఇబ్బందులు తలెత్తే అవకాశముందని నివాసితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా అధికారులకు తెలిసినా చర్యలు తీసుకోవడం లేదని, ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు చెబుతున్నారు. రాజకీయ నాయకుల అండదండలతో నిర్మాణదారుడు ధైర్యంగా నిబంధనలు ఉల్లంఘిస్తున్నాడని విమర్శిస్తున్నారు. అధికారుల వైఖరి “కర్ర విరగకుండా పాము చావాలి” అన్నట్టుగా ఉందని, స్పష్టమైన ఉల్లంఘనలపై కూడా కఠిన చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తున్నదని ప్రజలు అంటున్నారు.
ఇప్పటికైనా సంబంధిత విభాగాలు స్పందించి,నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న నిర్మాణాలను నిలిపివేసి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కాలనీ వాసులు డిమాండ్ చేస్తున్నారు.
