prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 22 March 2026, 7:02 pm Digital Edition : PRAJA KSHETRAM

అవమానాలు ఇక చాలు… రాజీనామాకు ముహూర్తం ఖరారు చేసిన జీవన్ రెడ్డి

అవమానాలు ఇక చాలు… రాజీనామాకు ముహూర్తం ఖరారు చేసిన జీవన్ రెడ్డి

  • కాంగ్రెస్ పార్టీని వీడనున్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి
  • పార్టీలో అవమానాలు భరించలేకే ఈ నిర్ణయమన్న సీనియర్ నేత
  • ఈ నెల 25న పార్టీకి రాజీనామా చేయనున్నట్టు వెల్లడి
  • కార్యకర్తలతో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని స్పష్టం

జగిత్యాల జిల్లా ప్రతినిధి మార్చి 22(ప్రజాక్షేత్రం):కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి టి. జీవన్‌రెడ్డి పార్టీని వీడాలని సంచలన నిర్ణయం తీసుకున్నారు. గత 20 నెలలుగా పార్టీలో తీవ్ర అవమానాలు, మానసిక క్షోభ అనుభవిస్తున్నానని, ఇకపై కొనసాగలేనని ఆయన స్పష్టం చేశారు. ఈ నెల 25న కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయనున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు జగిత్యాల జిల్లాకు చెందిన తన ముఖ్య అనుచరులు, కార్యకర్తలకు ఆయన ఒక లేఖ రాశారు. “అవమానాలు భరిస్తూ పార్టీలో కొనసాగలేను” అని ఆ లేఖలో తన ఆవేదనను జీవన్‌రెడ్డి వ్యక్తం చేశారు. పార్టీలో తనకు రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితులు సృష్టిస్తున్నారని, ఇది మానసికంగా ఎంతో బాధించిందని ఆయన వాపోయారు. తన భవిష్యత్ రాజకీయ కార్యాచరణపై త్వరలోనే స్పష్టత ఇస్తానని జీవన్‌రెడ్డి తెలిపారు. స్థానిక నేతలు, కార్యకర్తలతో సమావేశమై, వారి సలహాలు సూచనలు తీసుకున్న తర్వాతే తుది నిర్ణయం ప్రకటిస్తానని లేఖలో పేర్కొన్నారు. “నా రాజకీయ ప్రస్థానంలో మీ తోడు, మార్గదర్శనం కావాలి” అని ఆయన కార్యకర్తలను కోరారు. జీవన్‌రెడ్డి రాజీనామా ప్రకటనతో ఆయన ఏ పార్టీలో చేరతారనే దానిపై జగిత్యాల జిల్లా రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఆయన నిర్ణయం స్థానిక రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందోనని ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.