prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 01 March 2026, 7:39 pm Digital Edition : PRAJA KSHETRAM

గ్యాస్ సబ్సిడీ ఉత్తముచ్చటేన!?

గ్యాస్ సబ్సిడీ ఉత్తముచ్చటేన!?

  • దాదాపు రూ.150-180 కోట్ల నిధులు పెండింగ్‌
  • రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకం లబ్ధిదారులకు ఎదురుచూపులు.
  • ఆలస్యం కావడంతో ఆర్థికంగా ఇబ్బందులు.

హైదరాబాద్ మార్చి 01(ప్రజాక్షేత్రం):రాష్ట్ర ప్రభుత్వ 6 గ్యారంటీలో రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకం అమలు స్తంభనలోనా..? మూడు నెలలుగా, అసలు ఇప్పటివరకు ఒక్కసారి కూడా సబ్సిడీ జమ కాక లబ్ధిదారుల్లో ఆగ్రహం… తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన మహాలక్ష్మి పథకంలో భాగమైన రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకం అమలులో తీవ్ర ఆలస్యం చోటుచేసుకోవడంతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల హామీల్లో కీలకంగా నిలిచిన ఈ పథకం ప్రస్తుతం నిధుల కొరతతో నిలిచిపోయిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత మూడు నెలలుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో రాష్ట్ర సబ్సిడీ రూ.375 జమ కాకపోవడంతో సుమారు రూ.150–180 కోట్ల మేర నిధులు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం మార్కెట్‌లో గ్యాస్ సిలిండర్ ధర రూ.915 ఉండగా, వినియోగదారులు పూర్తి మొత్తాన్ని చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం రూ.375 మరియు కేంద్ర రాయితీ రూ.40 జమ చేయాల్సి ఉంటుంది. కానీ రాష్ట్ర సబ్సిడీ నిలిచిపోవడంతో పేద, మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 1.20 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉండగా, అందులో 39.57 లక్షల మంది ఈ పథకానికి అర్హులుగా గుర్తించబడ్డారు. ఏడాదికి రెండు కోట్లకు పైగా సిలిండర్లకు సబ్సిడీ ఇవ్వాల్సి ఉంటుందని అంచనా. ఇందుకోసం బడ్జెట్‌లో రూ.855.22 కోట్లు కేటాయించినప్పటికీ, నెలకు సుమారు రూ.80 కోట్లు విడుదల కావాల్సిన చోట వరుసగా మూడు నెలలుగా నిధులు జమ కాలేదని తెలుస్తోంది.

రాజకీయ ఆరోపణలు – ప్రతిపక్షాల విమర్శలు

ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. “ఎన్నికల ముందు హామీలు, ఎన్నికల తర్వాత మౌనం” అంటూ విమర్శలు చేస్తున్నారు. పథకాన్ని ప్రచార ప్రయోజనాల కోసం ఉపయోగించుకుని, అమలులో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నదా? లేక ప్రాధాన్యతల మార్పు జరిగిందా? అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.
మరోవైపు, అధికార పార్టీ నేతలు మాత్రం సాంకేతిక కారణాలతో కొంత ఆలస్యం జరిగిందని, త్వరలోనే పెండింగ్ సబ్సిడీ మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తామని స్పష్టం చేస్తున్నారు. పథకాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిలిపివేయబోమని హామీ ఇస్తున్నారు.

లబ్ధిదారుల ఆవేదన

“రూ.500కే సిలిండర్” అనే నమ్మకంతో కుటుంబ బడ్జెట్ ప్లాన్ చేసుకున్నామని, కానీ ఇప్పుడు పూర్తి ధర చెల్లించాల్సి రావడంతో ఇబ్బందులు పడుతున్నామని లబ్ధిదారులు వాపోతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ ఆలస్యం తీవ్ర ప్రభావం చూపుతోందని చెబుతున్నారు.
ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్ సబ్సిడీని విడుదల చేయాలని, పథకం అమలులో పారదర్శకత చూపించాలని ప్రజలు కోరుతున్నారు. రానున్న రోజుల్లో ఈ అంశం రాజకీయంగా మరింత వేడెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.