prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 07 March 2026, 5:34 pm Digital Edition : PRAJA KSHETRAM

జీతాల్లేని సేవ… నిరాశలో ఆశా వర్కర్ల జీవితం

జీతాల్లేని సేవ… నిరాశలో ఆశా వర్కర్ల జీవితం

– ఆరోగ్య సేవలు వారి చేతుల్లో… జీతాలు మాత్రం గాలిలో

— రెండు నెలలుగా చెల్లించని వేతనాలు సేవ మాత్రం ఆగదు

— ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే మహిళలకు ప్రభుత్వ గుర్తింపు ఎక్కడ?

— రూ.18 వేల కనీస వేతనం కోసం మళ్లీ ఉధృతమవుతున్న ఆశా వర్కర్ల పోరాటం

మహిళా దినోత్సవ ప్రత్యేక కథనం ప్రజాక్షేత్రం కూకట్ పల్లి ప్రతినిధి

మహిళా దినోత్సవం పేరుతో వేదికలపై మహిళా శక్తి గురించి గొప్ప గొప్ప ప్రసంగాలు వినిపిస్తున్న వేళ… అదే సమయంలో ప్రజల ఆరోగ్యాన్ని భుజాలపై మోస్తున్న ఆశా వర్కర్లు రెండు నెలలుగా జీతాలు లేక బతుకు భారాన్ని మోస్తున్నారు. ఇంటింటికీ తిరిగి ఆరోగ్య సేవలు అందించే మహిళలే తమ కుటుంబాన్ని పోషించుకోలేని స్థితిలో ఉంటే, మహిళా సాధికారత గురించి చెప్పే మాటలకు అర్థం ఏమిటి? మహిళలను గౌరవిస్తున్నామనే నినాదాల కంటే, ఆశా వర్కర్ల శ్రమకు న్యాయం చేయడమే నిజమైన మహిళా దినోత్సవం కాదా?

మహిళా దినోత్సవం రోజున దేశమంతా మహిళల సేవలను కొనియాడుతోంది. కానీ ప్రజల ఆరోగ్య రక్షణ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ఆశా వర్కర్ల జీవితాల్లో మాత్రం పండుగలా కాదు… బాధలా మారింది. రెండు నెలలుగా జీతాలు అందకపోవడంతో ఆశా వర్కర్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. “పిండి కొద్దీ రొట్టె” అనే నానుడి అందరికీ తెలిసిందే. కానీ ఆశా వర్కర్ల జీవితాల్లో మాత్రం పరిస్థితి భిన్నంగా మారుతోంది. పని మాత్రం ప్రభుత్వ ఉద్యోగులకంటే ఎక్కువగా చేయించుకుంటూ, వేతనం మాత్రం కనీస జీవనానికి కూడా సరిపోని స్థాయిలో ఇవ్వడం అనేది ఏ న్యాయం? ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే మహిళలే తమ కుటుంబాన్ని పోషించుకోవడానికి ఇబ్బందులు పడే పరిస్థితి రావడం ప్రభుత్వాలకు సిగ్గుచేటు కాదా? నెలల తరబడి వేతనాలు అందకపోవడంతో వారి కుటుంబాలు కష్టాల్లో కూరుకుపోతున్నారని కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంటింటికీ తిరుగుతూ గర్భిణీల ఆరోగ్యంపై పర్యవేక్షణ, చిన్నారులకు టీకాలు వేయించే కార్యక్రమం, పోషణపై అవగాహన కల్పించడం, వ్యాధుల నియంత్రణలో సహకరించడం వంటి ఎన్నో కీలక బాధ్యతలు ఆశా వర్కర్లపై ఉన్నాయి. ప్రజారోగ్య వ్యవస్థకు క్షేత్రస్థాయిలో బలమైన అండగా నిలుస్తున్న ఈ మహిళల శ్రమ లేకుండా ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాలు అమలవ్వడం కష్టమేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాగా ఇంతటి బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆశా వర్కర్లకు సరైన వేతనం, ఉద్యోగ భద్రత వంటి ప్రాథమిక హక్కులు మాత్రం దూరంగానే ఉన్నాయి. రెండు నెలలుగా జీతాలు అందకపోవడంతో కుటుంబాలను పోషించడం కూడా కష్టమైందని ఆశా వర్కర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూటగడవడమే కష్టంగా మారిందని, అప్పుల మీదే జీవనం సాగించాల్సి వస్తోందని వారు చెబుతున్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అనే సూక్తిని అమలు చేయాల్సిన ప్రభుత్వాలు ఆశా వర్కర్ల సమస్యల విషయంలో మాత్రం నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తున్నాయని కార్మిక సంఘాలు విమర్శిస్తున్నాయి. ప్రజల ఆరోగ్యానికి అండగా నిలుస్తున్న మహిళలకు కనీస గౌరవం కూడా దక్కడం లేదని వారు వాపోయారు. ఏళ్లుగా ఆశా వర్కర్లు తమ సమస్యల పరిష్కారం కోసం ధర్నాలు, నిరసనలు చేపడుతున్నా పరిస్థితిలో పెద్దగా మార్పు కనిపించడం లేదని, కనీస వేతనం రూ.18 వేలుగా నిర్ణయించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, వేతనాలను ప్రతి నెలా సమయానికి చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల సాధికారత గురించి మాట్లాడుతున్న ఈ సమయంలో ప్రజారోగ్య వ్యవస్థకు అండగా నిలుస్తున్న ఆశా వర్కర్ల పరిస్థితి మాత్రం అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్న ఈ మహిళల జీవితాల్లో కూడా నిజమైన “ఆశ” నింపేందుకు ప్రభుత్వాలు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆశా వర్కర్లు కోరుతున్నారు.

కష్టానికి తగిన గుర్తింపు అందని ద్రాక్షగానే ఉంది.

ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే వ్యవస్థలో కనిపించని సైనికులు ఉంటే, వాళ్లలో ముందుండేవారు ఆశా వర్కర్లు. గ్రామం నుంచి పట్టణం వరకు ఇంటింటికీ వెళ్లి గర్భిణుల ఆరోగ్యం చూసుకోవడం, చిన్నారుల టీకాలు, వ్యాధులపై అవగాహన కల్పించడం… ఇలా ఆరోగ్య సేవలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నా, మా కష్టానికి తగిన గుర్తింపు మాత్రం ఇంకా అందని ద్రాక్షగానే ఉంది. “ఆశా వర్కర్లు చేస్తున్న శ్రమను ప్రభుత్వం గుర్తించాలి. ప్రభుత్వ సంక్షేమ పథకాలలో మాకు కూడా అవకాశం కల్పించాలి. ముఖ్యంగా మా పనికి సౌలభ్యం కలిగేలా ఎలక్ట్రానిక్ టూ వీలర్స్ అందిస్తే గ్రామాల్లో ప్రజలకు సేవ చేయడం మరింత సులభమవుతుందని, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే మా సేవను గుర్తిస్తే… ఆశా వర్కర్ల జీవితాల్లో కూడా ఆశ వెలుగులు వెలుగుతాయని ఆశాభావం వ్యక్తం చేసింది.

సబియా

కూకట్ పల్లి కన్వీనర్ తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్

పారితోషిక విధానాన్ని తొలగించి కనీస వేతనాలు అమలు చేయాలి

ఆరోగ్య వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న ఆశా వర్కర్ల పరిస్థితి మాత్రం ఇప్పటికీ మారలేదు. గ్రామాలు, బస్తీల్లో ప్రజలకు ఆరోగ్య సేవలు అందిస్తూ, ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేస్తున్నా వారి సమస్యలు మాత్రం అలాగే కొనసాగుతున్నాయి. ఆశా వర్కర్ల విద్యా అర్హతను పరిగణనలోకి తీసుకొని వారికి ఏఎన్ఎం, జిఎన్ఎమ్ వంటి ఉద్యోగాల్లో అవకాశాలు కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఎన్నేళ్లుగా సేవలు అందిస్తున్న ఆశా వర్కర్లకు కేవలం పారితోషికం ఇవ్వడం సరిపోదని, పారితోషిక విధానాన్ని తొలగించి కనీస వేతనాలు అమలు చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అంతేకాదు, గత రెండు నెలలుగా జీతాలు అందకపోవడం వల్ల ఆశా వర్కర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబాన్ని నడిపించుకోవడం కూడా కష్టంగా మారిందని చెబుతున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే తమ సేవను గుర్తించి, పెండింగ్‌లో ఉన్న జీతాలను వెంటనే విడుదల చేయాలని, ఆశా వర్కర్ల సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

అనిత

మేడ్చల్ జిల్లా అధ్యక్షురాలు తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్