తెలంగాణకు ఐపీఎస్ అధికారుల సంఖ్య పెంచాలని కేంద్రానికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి
నేషనల్ బ్యూరో మార్చి 05(ప్రజాక్షేత్రం):తెలంగాణ రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా ఐపీఎస్ అధికారుల సంఖ్యను పెంచి కేటాయించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కోరారు. ఢిల్లీ పర్యటన సందర్భంగా ఆయన అమిత్ షాతో భేటీ అయి రాష్ట్ర పోలీసింగ్కు సంబంధించిన పలు ముఖ్య అంశాలను చర్చించారు. రాష్ట్ర విభజన అనంతరం 2016లో మొదటి క్యాడర్ రివ్యూ జరిగిందని, 2021లో జరగాల్సిన రెండో క్యాడర్ రివ్యూ ఆలస్యంగా 2025లో నిర్వహించారని సీఎం గుర్తుచేశారు. ఆ సమయంలో తెలంగాణకు కేవలం ఏడుగురు ఐపీఎస్ అధికారులనే అదనంగా కేటాయించారని తెలిపారు. దేశంతో పాటు తెలంగాణ రాష్ట్రం కూడా సైబర్ నేరాలు, డ్రగ్స్, వైట్ కాలర్ నేరాలు వంటి ఆధునిక సవాళ్లను ఎదుర్కొంటోందని సీఎం పేర్కొన్నారు. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి కమిషనరేట్ల పునర్వ్యవస్థీకరణ, ఫ్యూచర్ సిటీ కమిషనర్ వ్యవస్థ ఏర్పాటుతో పాటు హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న జనాభా దృష్ట్యా మరింత మంది ఐపీఎస్ అధికారుల అవసరం ఉందని వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 83 మంది ఐపీఎస్ అధికారులు ఉన్నారని, ఆ సంఖ్యను 103కు పెంచాలని కోరుతూ 2026లో జరగాల్సిన మూడో క్యాడర్ రివ్యూను నిర్దేశిత సమయంలోనే చేపట్టాలని కేంద్రాన్ని సీఎం అభ్యర్థించారు. ఈ భేటీలో మావోయిస్టుల లొంగుబాటు అంశంపైనా చర్చ జరిగింది. గత రెండేళ్లలో తెలంగాణ పోలీసింగ్లో గణనీయమైన మార్పులు వచ్చాయని సీఎం తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 591 మంది మావోయిస్టులు ఆయుధాలను వదిలి జనజీవన స్రవంతిలో కలిసినట్లు వివరించారు. ఇటీవల పలువురు మావోయిస్టు అగ్రనేతలు కూడా సాధారణ జీవితాన్ని గడపడానికి ముందుకు వచ్చారని, వారికి నిబంధనల ప్రకారం పునరావాసం, పరిహారం అందిస్తున్న విషయాన్ని కేంద్ర మంత్రికి వివరించారు. అలాగే రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించి సహకరించాలని కూడా సీఎం కోరారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ వి. శేషాద్రి, రాష్ట్ర డీజీపీ బి. శివధర్ రెడ్డి, ఇంటెలిజెన్స్ అదనపు డీజీపీ విజయ్ కుమార్, ఎస్ఐబి ఐజీపీ బి. సుమతి పాల్గొన్నారు.