prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 30 March 2026, 5:31 pm Digital Edition : PRAJA KSHETRAM

ప్రజావాణిలో అధికారుల నిర్లక్ష్యం

ప్రజావాణిలో అధికారుల నిర్లక్ష్యం

  • విన‌తులు స్వీక‌రించాల్సిన స‌మ‌యంలో ఫోన్‌లో మునిగిన అధికారులు
  • గంటల త‌ర‌బ‌డి క్యూలో ద‌ర‌ఖాస్తుదారులు

కరీంనగర్ మార్చి 30(ప్రజాక్షేత్రం):ప్రజల సమస్యలు వినాల్సిన సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం తీవ్ర అసంతృప్తికి దారితీసిందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్ కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఒక వైద్య అధికారి మొబైల్ ఫోన్‌లో నిమగ్నమై ఉండడం చర్చనీయాంశమైంది. గంటల తరబడి క్యూలో నిలబడి తమ సమస్యలు చెప్పేందుకు వచ్చిన ప్రజలు ఎదురు చూస్తుండగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అధికారి కాలక్షేపం చేయడం విమర్శలకు దారి తీసింది. కార్యక్రమం జరుగుతున్న సమయంలో కొందరు అధికారులు ఫోన్లలో మునిగిపోయి ఉండటం, మరికొందరు నిర్లక్ష్యంగా వ్యవహరించడం గమనించామని ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రజావాణి లక్ష్యాన్ని ఇది దెబ్బతీస్తోందని అభిప్రాయపడుతున్నారు.

బాధ్యత లేదా…?

ప్రజలతో మమేకమవుతూ సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ఉన్న అధికారులే ఇలా వ్యవహరించడం ప్రభుత్వ సేవలపై నమ్మకాన్ని దెబ్బతీస్తోందని ప్రజలు వాపోతున్నారు. సమస్యల పరిష్కారం కోసం ఆశతో వచ్చిన వారికి నిరాశ మిగిలిందని తెలిపారు. ఇటువంటి ఘటనలపై ఉన్నతాధికారులు దృష్టి సారించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రజావాణి కార్యక్రమం లక్ష్యాన్ని నిలబెట్టేందుకు అధికారుల్లో బాధ్యతాభావం పెంపొందించాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు.