వనపర్తి టౌన్ హాల్, మార్కెట్ కాంప్లెక్స్ త్వరలో ప్రారంభం..
– పెండింగ్ పనులు పూర్తి చేసి నెల రోజుల్లో వినియోగంలోకి తేవాలి.
– కలెక్టర్ ఆదర్శ్ సురభి.
వనపర్తి, మార్చి 16(ప్రజాక్షేత్రం ):జిల్లా కేంద్రంలో నిర్మాణం పూర్తి అయినప్పటికీ ఇప్పటికీ వినియోగంలోకి రాని నూతన టౌన్ హాల్, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కాంప్లెక్స్ను త్వరితగతిన ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. సోమవారం వనపర్తి పట్టణంలో నూతనంగా నిర్మించిన టౌన్ హాల్, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ సముదాయాన్ని సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ టౌన్ హాల్లో పెండింగ్లో ఉన్న పనులను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. నిధులు ఉన్నప్పటికీ పనులు ముందుకు సాగకపోవడంపై పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫర్నిచర్ ఏర్పాటు, సౌండ్ ప్రూఫింగ్ వంటి పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. పంచాయతీరాజ్, పబ్లిక్ హెల్త్ విభాగాలు సమన్వయంతో మిగిలిన పనులను పూర్తి చేసి వచ్చే నెలలోపు టౌన్ హాల్ను వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. టౌన్ హాల్ నిర్మాణానికి గతంలో రూ.3.75 కోట్లు మంజూరయ్యాయని, అందులో మిగిలిన నిధులతో పెండింగ్ పనులు పూర్తి చేయాలని చెప్పారు. అదేవిధంగా నూతన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కాంప్లెక్స్ను కూడా ఏప్రిల్ 1లోపు వినియోగంలోకి తీసుకురావాలని కలెక్టర్ సూచించారు. దుకాణాలను వ్యాపారులకు కేటాయించేందుకు లక్కీ డ్రా విధానాన్ని అనుసరించాలని తెలిపారు. దుకాణాల కోసం ఆసక్తి గల వారు దరఖాస్తు చేసుకునేలా ప్రకటనలు ఇవ్వాలని ఆదేశించారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని మార్కెట్ సముదాయానికి తరలించేందుకు అవసరమైన సౌకర్యాలను కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వనపర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, పబ్లిక్ హెల్త్, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ సిబ్బంది, ఇతర అధికారులు పాల్గొన్నారు.