దారుణాతి దారుణం… బ్యాంకింగ్ వ్యవస్థ, అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ఠ!
-చనిపోయిన సోదరి అస్థికలతో బ్యాంకు ముందు నిలబడ్డ గిరిజనుడు!!
నేషనల్ బ్యూరో ఏప్రిల్ 29(ప్రజాక్షేత్రం):నిబంధనల పేరుతో సామాన్యులను ఇబ్బంది పెట్టే వ్యవస్థ తీరుకు పరాకాష్ఠగా ఒడిశాలోని కేంఝర్ జిల్లాలో ఒక విస్తుపోయే ఘటన చోటుచేసుకుంది. చనిపోయిన తన సోదరి ఖాతాలోని డబ్బు కోసం మూడు నెలలుగా బ్యాంకు చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో, విసిగిపోయిన ఒక గిరిజనుడు నేరుగా ఆమె అస్థిపంజరాన్నే బ్యాంకు అధికారుల ముందు ప్రదర్శించాడు. దియానలి గ్రామానికి చెందిన జీతూ ముండా (50) సోదరి కల్రా ముండా (56) జనవరి 26న మరణించారు. ఆమెకు ఒడిశా గ్రామీణ బ్యాంకులోని మాలిపోసి శాఖలో ఖాతా ఉండగా, అందులో సుమారు రూ. 20,000 నగదు ఉంది. ఆ సొమ్మును విత్డ్రా చేసుకునేందుకు జీతూ గత మూడు నెలలుగా బ్యాంకు మెట్లు ఎక్కుతున్నాడు. అయితే, “ఖాతాదారు వస్తేనే డబ్బులు ఇస్తాం” అంటూ సిబ్బంది పదేపదే నిబంధనలు వల్లెవేశారు. తన సోదరి చనిపోయిందని మొత్తుకున్నా అధికారులు వినకపోవడంతో, ఆవేదనకు లోనైన జీతూ.. చివరకు సమాధిని తవ్వి ఆమె అస్థిపంజరాన్ని ఒక గుడ్డలో మూటకట్టుకుని బ్యాంకుకు తీసుకువచ్చాడు. “ఆమె చనిపోయిందని చెప్పినా ఎవరూ నమ్మలేదు. అందుకే ఆమెను తీసుకొస్తేనే డబ్బులిస్తామన్న సిబ్బందికి నిజం చూపించడానికే ఈ పని చేశాను” అని జీతూ కన్నీటితో వెల్లడించాడు. బ్యాంకు హాలులో అస్థిపంజరాన్ని చూసి సిబ్బంది, ఇతర కస్టమర్లు ఒక్కసారిగా హడలిపోయారు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మానవతా కోణంలో స్పందించిన పోలీసులు, జీతూకు ఆ నగదు అందేలా బ్యాంకు అధికారులతో మాట్లాడి అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.