పెట్రోల్ బంకుల్లో కొత్త రూల్స్.. రేషన్ పద్ధతిలో ఇంధనం…
- ఏ వాహనమైనా రూ.1000 ఇంధనమే?!
హైదరాబాద్, ఏప్రిల్ 29(ప్రజాక్షేత్రం):మరోసారి రెండు తెలుగు రాష్ట్రాలను ఇంధన కొరత వేధిస్తోంది. ఒక్కసారిగా డిమాండ్ పెరిగి సప్లై తగ్గడంతో చాలా చోట్ల పెట్రోల్ బంకుల ముందు వాహనాలు కిలోమీటర్ల మేర బారులు తీరి ఉన్నాయి. ఇక అనేక ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల ముందు నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఇంధన నిల్వలు నిండుకుంటున్నాయని, ధరలు సైతం పెరగబోతున్నాయనే ఊహాగానాల నేపథ్యంలో స్టాక్ ఉన్న బంకుల వద్దకు వందల సంఖ్యల్లో వాహనదారులు క్యూ కడుతున్నారు. ఈ వాహనాల రద్దీని నియంత్రించలేక బంక్ యజమానులు చేతులెత్తేసే పరిస్థితి కనిపిస్తోంది.
ఏ వాహనమైనా రూ.1000 ఇంధనమే?!
అందుబాటులో ఉన్న నిల్వలను అందరికీ సమానంగా పంపిణీ చేయడానికి పెట్రోల్ బంకుల యజమానులు కఠిన నిబంధనలను అమల్లోకి తీసుకువస్తున్నారు. హైదరాబాద్ నగరంలోని పలు బంకుల్లో రేషన్ పద్ధతిని యాజమాన్యాలు అమలు చేస్తున్నాయి. బైక్, కారు, ఇతర భారీ వాహనాలు ఏరకమైనవైనారేషన్ పద్ధతిలో కేవలం రూ. 1000 వరకు మాత్రమే ఇంధనాన్ని ఫిల్ చేస్తున్నారు. ఇక ప్లాస్టిక్ బాటిళ్లు, పెద్ద డబ్బాలు, క్యాన్లలో పెట్రోల్, డీజిల్ నింపడాన్ని నిషేధించారు. అత్యవసర పరిస్థితుల పేరుతో వచ్చే వారికి కూడా ఇంధనం నింపే ప్రసక్తే లేదని బంకు యజమానులు ఖరాఖండిగా చెబుతున్నారు. అయితే చమురు సంస్థలు సరఫరాలో జాప్యం వల్లే ఈసారి ఇంధన కొరత సమస్య ఉత్పన్నం అవుతోందని డీలర్లు ఆరోపిస్తున్నారు. ఓ వైపు సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని ప్రభుత్వం స్పష్టత ఇచ్చినా ప్రజలు మాత్రం అవసరానికి మించి ఇంధనం కొనుగోళ్లు చేస్తుండటం వల్లే ఈ సమస్య తీవ్రం అవుతోందని అధికారులు చెబుతున్నారు.