ఫూలేకు ఘనంగా నివాళులు అర్పించిన మంద కృష్ణ మాదిగ
- ఫూలే ఆశయాలు సమాజానికి దారిదీపం: మంద కృష్ణ మాదిగ
హైదరాబాద్, ఏప్రిల్ 11(ప్రజాక్షేత్రం):మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి సందర్భంగా అంబర్పేటలోని ఆయన విగ్రహానికి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత మంద కృష్ణ మాదిగ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని ఫూలే చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సమాజంలో అణగారిన వర్గాల హక్కుల సాధనకు, మహిళల విద్యాభివృద్ధికి ఫూలే చేసిన కృషి అపారమని తెలిపారు. సమానత్వం, సామాజిక న్యాయం, విద్యా విస్తరణ కోసం ఆయన చేసిన పోరాటం నేటికీ ఆదర్శమని పేర్కొన్నారు. ఫూలే ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వాలు కృషి చేయాలని, సమాజంలో అసమానతలను తొలగించడానికి ఫూలే చూపిన మార్గం అవసరమని సూచించారు. ఈ కార్యక్రమంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొని మహాత్మా ఫూలేకు ఘన నివాళులు అర్పించారు.