prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 01 April 2026, 6:50 pm Digital Edition : PRAJA KSHETRAM

మహిళా రిజర్వేషన్‌లో బీసీ మహిళలకు న్యాయం జరగాలి”

మహిళా రిజర్వేషన్‌లో బీసీ మహిళలకు న్యాయం జరగాలి”

“నారీ శక్తి వందన అధినియమంలో” సగంపైగా ఉన్న వర్గానికి చోటు ఎక్కడ?

భారతదేశ జనాభాలో సగభాగం మహిళలే. ఆ మహిళల్లోనే సగంపైగా వెనుకబడిన తరగతులకు చెందిన మహిళలున్నారు. కానీ, వీరికి చట్టసభల్లో న్యాయమైన ప్రాతినిధ్యం కల్పించే ప్రయత్నం నేటికీ కూడా జరుగలేదు. నారీ శక్తి వందన అధినియమం మహిళా రిజర్వేషన్ బిల్లు చరిత్రాత్మకమైన చట్టంగా అందరూ కీర్తిస్తున్నారు. నిజమే, కానీ ఈ చట్టంలో బీసీ (వెనుకబడిన తరగతులు) మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్లు లేవనే వాస్తవాన్ని విస్మరించడం, సామాజిక న్యాయం పట్ల మన నిబద్ధతను ప్రశ్నార్థకం చేస్తుంది.
లోక్‌సభలో ఇప్పుడు 543 మంది సభ్యులు ఉండగా, వారిలో మహిళలు కేవలం 78 మంది మాత్రమే. అంటే, 15 శాతం కూడా కాదు. రాజ్యసభలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. 14 శాతమే మహిళలున్నారు. దేశవ్యాప్తంగా 19రాష్ట్రాల అసెంబ్లీలలో మహిళా ప్రాతినిధ్యం 10శాతానికి కూడా చేరలేదు. ఈ నేపథ్యంలో మహిళా రిజర్వేషన్ బిల్లు తప్పనిసరి. కానీ “ఏ మహిళలకు న్యాయం?” అనే ప్రశ్నకు సమాధానం లేకుండా ఈ చట్టం అసంపూర్ణంగానే మిగులుతుంది.

చరిత్ర చెప్పిన పాఠం, బీసీ మహిళ ఎప్పుడూ వెనకే ?

1996లో హెచ్‌డీ దేవెగౌడ నేతృత్వంలోని యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం తొలిసారి మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టింది. వాజ్‌పేయీ హయాంలో, మన్మోహన్ సింగ్ హయాంలో పలుమార్లు ప్రయత్నాలు జరిగాయి. 2010లో రాజ్యసభ ఆమోదించినా లోక్‌సభలో వీగిపోయింది. 2014లో లోక్‌సభ రద్దుతో బిల్లు మరోసారి మరుగున పడింది. ఈ 27సంవత్సరాల చరిత్రలో ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంది, ఓబీసీ రిజర్వేషన్ల ప్రస్తావన వచ్చినప్పుడల్లా బిల్లు ముందుకు సాగలేదు. 2023లో నూతన పార్లమెంట్ భవనంలో తొలి సమావేశంలోనే కేంద్ర న్యాయమంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ బిల్లు ప్రవేశపెట్టారు. ఉభయసభలు ఆమోదించాయి. ప్రధాని మోదీ దీన్ని “నారీ శక్తి వందన అధినియమం” గా అభివర్ణించారు. కానీ ఈ చట్టంలో బీసీ మహిళలకు ప్రత్యేక కోటా లేదు. ఎస్సీ, ఎస్టీ మహిళలకు వారి వర్గాల్లో రిజర్వేషన్లు ఉన్నాయి. బీసీ స్త్రీలు మాత్రం జనరల్ మహిళా కోటాలో పోటీపడాల్సిందే. ఇది అన్యాయం కాదా?
సంఖ్యలు చెప్పే నిజం? బీసీ మహిళలు ఎక్కడున్నారు ?
జాతీయ జనగణన గణాంకాల ప్రకారం భారతదేశ జనాభాలో ఓబీసీలు సుమారు 52శాతం ఉన్నారు. వీరిలో సగం మహిళలు. అంటే, దేశంలో దాదాపు 26 కోట్లకు పైగా బీసీ స్త్రీలు ఉన్నారు. అయితే ప్రస్తుత లోక్‌సభలో ఓబీసీ మహిళా ఎంపీల సంఖ్య వేళ్ళ మీద లెక్కించవచ్చు. రాష్ట్ర అసెంబ్లీలలో పరిస్థితి మరింత దయనీయంగా ఉంది.
తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాలుండగా, బిల్లు అమలైతే 40 మహిళలకు రిజర్వ్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో 175స్థానాలుండగా 58 మహిళలకు కేటాయిస్తారు. కానీ, ఈ 40, 58 స్థానాల్లో బీసీ మహిళలకు ఎన్ని వస్తాయి? ప్రత్యేక కోటా లేకుండా, ఆర్థికంగా వెనకబడి, సామాజికంగా వివక్షకు గురవుతున్న బీసీ మహిళలు అగ్రవర్ణ మహిళలతో పోటీలో గెలవగలరా? ఉత్తరప్రదేశ్‌లో 403 స్థానాల్లో 132, బీహార్‌లో 243 స్థానాల్లో 81 మహిళలకు రిజర్వ్ అవుతుంది. ఈ లెక్కల వెనక బీసీ మహిళల వాటా ఎంత అనేది ? ప్రశ్నగానే మిగులుతుంది.

మహిళా రిజర్వేషన్‌లో “ఏ మహిళ” అనే ప్రశ్న ?

మహిళా రిజర్వేషన్ అమలైనప్పుడు చట్టసభలకు ఎన్నికయ్యే 33 శాతం మహిళలు ఎవరు? చారిత్రక అనుభవం చూస్తే, అగ్రవర్ణ కుటుంబాలకు చెందిన, ఆర్థికంగా స్థిరంగా ఉన్న, రాజకీయ నేపథ్యం ఉన్న మహిళలే అధికంగా ఎన్నికవుతారు. ఇది ఊహ మాత్రమే కాదు, పంచాయతీ స్థాయిలో మహిళా రిజర్వేషన్లు అమలైన చోట ఈ పరిస్థితి ప్రత్యక్షంగా కనిపించింది. గ్రామ పంచాయతీలలో మహిళా రిజర్వేషన్లు అమలు చేశాక కొన్నిచోట్ల “సర్పంచ్ భర్త” అనే సంప్రదాయం మొదలైంది. మహిళ పేరు మీద భర్త లేదా బంధువు పాలన నడిపించే పరిస్థితి. ఇది బీసీ మహిళలకు నాయకత్వ నైపుణ్యాలు లేవని అర్థం కాదు, అవకాశాలు, వనరులు, చదువు, సహాయం అందించకుండా కేవలం రిజర్వేషన్ ఇచ్చినా, ఆచరణలో ఫలితం పరిమితంగా ఉంటుందని అర్థం.
బీసీ మహిళా రిజర్వేషన్ కోటాలో ప్రత్యేకమైన వాటా ఇస్తే, అది వారికి నిజమైన అవకాశం అవుతుంది. ఎందుకంటే ఎస్సీ, ఎస్టీ వర్గాల్లో మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్ ఉంది. బీసీ వర్గానికి చట్టసభల్లో ఇంకా రిజర్వేషన్లే లేవు. కనీసం మహిళా కోటాలోనైనా బీసీ మహిళలకు 33 శాతం ఇవ్వాలని డిమాండ్ చేయడం అన్యాయమా?

రాజకీయ పార్టీలకు సువర్ణావకాశం ఉపయోగించుకుంటారా ?

నారీ శక్తి వందన అధినియమం చట్టంగా మారింది. కానీ దాన్ని అమలు చేయడానికి జనగణన, డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన) జరగాలి. ప్రభుత్వం తరపున 2027 నాటికి జనగణన పూర్తవుతుందని చెప్పారు. ఆ తర్వాత డీలిమిటేషన్ జరుగుతుంది. 2029 ఎన్నికల్లో అమలవుతుందని అంచనా. ఇదే సమయంలో రాజకీయ పార్టీలు ముఖ్యంగా, కాంగ్రెస్, బహుజన్ సమాజ్ వాది పార్టీ, డీఎంకే, సమాజ్‌వాది పార్టీ వంటి పార్టీలు ఓబీసీ మహిళల రిజర్వేషన్ డిమాండ్‌ను రాజకీయ అజెండాగా మార్చవచ్చు. కాంగ్రెస్ పార్టీ 2025జూలైలో జాతీయ స్థాయిలో “న్యాయ భాగేదారీ సమ్మేళనం” నిర్వహించి ఓబీసీ వర్గాలకు న్యాయం చేస్తామని రాహుల్ గాంధీ ప్రకటించారు. ఇప్పుడు ఆ మాటలను ఆచరణలో చూపించే అవకాశం వచ్చింది.
మహిళా రిజర్వేషన్ కోటాలో బీసీ మహిళలకు కనీసం 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కాంగ్రెస్ పట్టుబట్టాలి. ఈ అంశంపై రాజ్యసభలో, పార్లమెంట్ బయట ఒత్తిడి తేవాలి. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వానికి ⅔ మెజారిటీ లేదు. రాజ్యాంగ సవరణకు కాంగ్రెస్ మద్దతు అవసరం. ఆ మద్దతుకు బీసీ మహిళా రిజర్వేషన్ ఒక ముఖ్యమైన షరతుగా ఉండాలి.
అలాగే “సబ్ కా సాథ్, సబ్ కా వికాస్”అని చెప్పే బీజేపీ కూడా తమ పార్టీలో ఉన్న బీసీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ డిమాండ్ కోసం అంతర్గతంగా ఒత్తిడి తేవాలి. బీసీ వర్గాల ఓట్లతో అధికారంలోకి వచ్చిన పార్టీ, ఆ వర్గాల మహిళలకు న్యాయం చేయడంలో వెనుకంజ వేస్తే అది వారికి చారిత్రక తప్పిదమవుతుంది.
డీలిమిటేషన్ జరిగిన తర్వాత తెలంగాణలో 119 నుంచి 179 స్థానాలకు, ఆంధ్రప్రదేశ్‌లో 175 నుంచి 263 స్థానాలకు పెరగవచ్చు. లోక్‌సభ స్థానాలు కూడా పెరుగుతాయి. ఈ పెరిగిన స్థానాల్లో మహిళలకు 33 శాతం కేటాయించాలి. రిజర్వ్ నియోజకవర్గాల ఎంపిక లాటరీ పద్ధతిలో జరుగుతుందని అంటున్నారు. ఈ లాటరీ పద్ధతిలో బీసీ స్త్రీలకు ప్రత్యేక కోటా లేకుండా పోతే, వారికి అందే స్థానాలు యాదృచ్ఛికంగా ఉంటాయి. కానీ రిజర్వేషన్ ఉంటే, ఆ స్థానాల్లో తప్పకుండా బీసీ స్త్రీలే పోటీ చేయాల్సి వస్తుంది. ఇది రాజ్యాంగ హక్కుల స్ఫూర్తికి అనుగుణంగా ఉంటుంది. పంచాయతీరాజ్ వ్యవస్థలో బీసీ రిజర్వేషన్ అమలైన రాష్ట్రాల అనుభవాలు చూస్తే, ఒడిశా, మహారాష్ట్ర వంటి చోట్ల బీసీ రిజర్వేషన్లు అమలైనప్పుడు ఆ వర్గాల నుండి నిజమైన నాయకత్వం బయటికొచ్చింది. ఇదే అనుభవాన్ని శాసనసభ స్థాయికి విస్తరించడం శాస్ర్తీయంగా సరైనదే.

బీసీ మహిళలకు రెండు వైపుల అణచివేత ?

బీసీ మహిళ అంటే ఆమె కేవలం “మహిళ” మాత్రమే కాదు. ఆమె ఒక నిర్దిష్ట సామాజిక, ఆర్థిక వర్గానికి చెందిన మహిళ. ఒక వైపు కులవ్యవస్థ, మరోవైపు పితృస్వామ్యం, ఈ రెండు రకాల అణచివేతలను ఒకేసారి ఎదుర్కొంటున్న ఆమె, ఆర్థికంగా వెనకబడి, విద్యాపరంగా వివక్షకు గురై, సాంఘికంగా అట్టడుగున ఉన్న బీసీ మహిళలను, ఆర్థికంగా బలపడిన ఉన్నత వర్గపు మహిళతో ఒకే కోటాలో పోటీ చేయమనడం ఎంత వరకు న్యాయం ?
మహిళా సాధికారత కేవలం సంఖ్యల మీద ఆధారపడదు. ఎందరు మహిళలు పార్లమెంట్‌లో కూర్చున్నారు అనేది కాదు, ఏ నేపథ్యం నుండి, ఏ అనుభవాల నుండి వారు వచ్చారు అనేది ముఖ్యం. ఒక రైతు కుటుంబం నుండి వచ్చిన బీసీ మహిళా గళం, గ్రామీణ వెనకబాటుతనం, కష్టాల జీవితం అనుభవించిన మహిళ గళం పార్లమెంట్‌లో వినబడాలంటే ప్రత్యేక రిజర్వేషన్ తప్పనిసరి.
మహిళా రిజర్వేషన్ అమలుకు ముందే, పార్లమెంట్‌లో ఒక సవరణ బిల్లు తీసుకొచ్చి ఓబీసీ మహిళలకు మహిళా కోటాలో 33 శాతం రిజర్వేషన్ నిర్ధారించాలి. దీన్ని సుప్రీం కోర్టు గుర్తించిన ఓబీసీ జాబితాల ఆధారంగా రాష్ట్రాల వారీగా అమలు చేయవచ్చు. ఈ అంశంలో పౌర సమాజం, ఓబీసీ సంఘాలు, మహిళా సంఘాలు, విద్యావంతులు, పాత్రికేయులు కలిసి గొంతు వినిపించాలి. 2029 ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ సమయంలో పార్టీలపై ఒత్తిడి తీసుకొస్తేనే ఫలితం ఉంటుంది. అన్ని పార్టీలకు బీసీల ఓట్లు అవసరం. బీసీ మహిళలు కూడా తమ ఓటు అమ్ముకోకుండా, తమకు న్యాయం ఇచ్చే పార్టీకి మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకోవాలి.
నారీ శక్తి వందన అధినియమం ఒక మంచి ప్రారంభం. కానీ అది అర్ధ సత్యంగా మిగిలిపోకూడదు. మహిళల్లో అత్యంత వెనకబడిన వర్గాలైన బీసీ మహిళలను విస్మరించే చట్టం, సామాజిక న్యాయం పేరుతో అసమానత్వాన్నే స్థిరపరుస్తుంది. రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్. అంబేడ్కర్ చెప్పిన మాటల్లో “రాజకీయ ప్రజాస్వామ్యం మనుగడ సాగించాలంటే, సామాజిక ప్రజాస్వామ్యం పునాది అయి ఉండాలి.” బీసీ మహిళలకు చట్టసభల్లో న్యాయమైన ప్రాతినిధ్యం కల్పించడం, కేవలం ఒక రాజకీయ మార్పు కాదు, అది సామాజిక ప్రజాస్వామ్యాన్ని నిర్మించే మొదటి అడుగు. బీసీ మహిళా రిజర్వేషన్లు అవసరం కాదు, హక్కు. ఆ హక్కు కోసం పోరాటం ఇప్పుడే ప్రారంభమవ్వాలి.

డాక్టర్. వై.శివ ముదిరాజ్
తెలంగాణ ప్రెసిడెంట్,
ఆల్ ఇండియా ఓబిసి స్టూడెంట్స్ అసోషియేషన్స్, హైద్రాబాదు సెంట్రల్ యూనివర్శిటీ
ఫోన్ నెంబర్:9963240519