prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 30 April 2026, 10:55 am Digital Edition : PRAJA KSHETRAM

వి. హనుమంతరావుకు కీలక పదవిని కట్టబెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం

వి. హనుమంతరావుకు కీలక పదవిని కట్టబెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం

  • బీసీ సంక్షేమ శాఖ అభివృద్ధి సలహాదారుగా వీహెచ్ నియామకం
  • అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
  • రాష్ట్ర మంత్రి సమాన హోదాలో ఈ పదవిలో వీహెచ్ నియామకం

హైదరాబాద్ ఏప్రిల్ 30(ప్రజాక్షేత్రం):కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి. హనుమంతరావు (వీహెచ్)కు తెలంగాణ ప్రభుత్వం సముచిత స్థానం కల్పించింది. బీసీ వర్గాల గళంగా గుర్తింపు పొందిన ఆయనను రాష్ట్ర ప్రభుత్వ బీసీ సంక్షేమ శాఖ అభివృద్ధి సలహాదారుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వి. హనుమంతరావు గారిని రాష్ట్ర మంత్రి హోదాతో ఈ పదవిలో నియమించారు. దీని ప్రకారం ఆయనకు నెలకు రూ. 1,00,000 వేతనం అందనుంది. ఒకవేళ ప్రభుత్వ నివాసం కేటాయించకపోతే రూ. 50,000 ఇంటి అద్దె భత్యం (హెచ్ఆర్సి) పొందే అవకాశం ఉంటుంది. ప్రయాణ ఖర్చుల కోసం రూ. 30,000 కన్వేయన్స్ అలవెన్స్, రూ. 15,000 ఇంధన ఖర్చులతో పాటు డ్రైవర్‌తో కూడిన ప్రభుత్వ వాహనాన్ని కూడా ప్రభుత్వం సమకూరుస్తోంది. వైద్య ఖర్చుల విషయంలో కూడా ఆయనకు అఖిల భారత సర్వీసు అధికారులు, మంత్రులతో సమానమైన రీయింబర్స్‌మెంట్ సౌకర్యం కల్పించారు. ఆయన కార్యకలాపాల కోసం బీసీ సంక్షేమ శాఖ ఒక ప్రైవేట్ సెక్రటరీ (పీఎస్), డేటా ఎంట్రీ ఆపరేటర్, ఆఫీస్ సబార్డినేట్లు, డ్రైవర్‌తో కూడిన ప్రత్యేక సిబ్బందిని కేటాయించింది. దశాబ్దాలుగా బీసీ హక్కుల కోసం పోరాడుతున్న హనుమంతరావు అపారమైన అనుభవం… ప్రభుత్వం అమలు చేయబోయే సంక్షేమ పథకాలకు దిశానిర్దేశం చేయడంలో కీలకం కానుంది. ముఖ్యంగా వెనుకబడిన తరగతుల అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్లో ఆయన సలహాలు ఇప్పుడు అధికారిక ముద్ర వేయనున్నాయి. సీనియర్ నేతలకు ఇలాంటి కీలక బాధ్యతలు అప్పగించడం ద్వారా అటు పార్టీలోనూ, ఇటు సామాజిక సమీకరణాల్లోనూ సమతుల్యత పాటించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు కనిపిస్తోంది.