prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 01 April 2026, 6:37 pm Digital Edition : PRAJA KSHETRAM

ఊటీ కాదు ఇది మన అనంతగిరి

ఊటీ కాదు ఇది మన అనంతగిరి

  • పర్యాటకలను ఆకర్షిస్తున్న అనంతగిరి అందాలు
  • జాలువారే జలపాతాలు.. చల్లటి వాతావరణం
  • దట్టమైన అడవి ప్రకృతి ప్రశాంతత

తెలంగాణలోని వికారాబాద్ సమీపంలో ఉన్న అనంతగిరి కొండలు దట్టమైన అడవులు, జాలువారే జలపాతాలు, చల్లటి వాతావరణం, చారిత్రక అనంత పద్మనాభ స్వామి ఆలయంతో పర్యాటకులను ఆకర్షించే అద్భుతమైన హిల్ స్టేషన్ గా మారింది. హైదరాబాద్‌కు దగ్గరగా ఉండటం వల్ల వారాంతపు విహారానికి ట్రెకింగ్, ప్రకృతి ప్రేమికులకు ఇది ఒక పరిపూర్ణమైన ప్రదేశం. దట్టమైన అడవులు, ఎత్తైన కొండలు పచ్చని చెట్లతో ఈ ప్రాంతం పర్యాటకులకు కనువిందు చేస్తుంది.అనంతగిరి కొండలపై కొలువై ఉన్న పురాతన ఆలయం అనంత పద్మనాభ స్వామి దేవాలయం. ఇది అత్యంత ప్రసిద్ధి చెందినది.వర్షాకాలంలో ఇక్కడ జాలువారే జలపాతాలు, కొండలపై నుండి కనిపించే వ్యూ పాయింట్లు పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తాయి.అటవీ మార్గంలో ట్రెకింగ్, క్యాంపింగ్ , రాక్ క్లైంబింగ్ వంటి సాహస క్రీడలకు ఇది అనువైన ప్రదేశం. హైదరాబాద్ నుండి కేవలం 75 కిలోమీటర్ల దూరంలో, వికారాబాద్‌కు 6 కిలోమీటర్ల దూరంలో ఉన్నఅనంతగిరికొండలు భారతదేశం లోని తెలంగాణ రాష్ట్రంలో గల వికారాబాదు జిల్లా లోని అనంతగిరిలో ఉన్నాయి.ఈ కొండల పైనుండి నీరు ఉస్మాన్ సాగర్, అనంత సాగర్ ప్రవహిస్తాయి. ఇది తెలంగాణ రాష్ట్రం లోని అతి పెద్ద దట్టడవి. ఇందులో అనంతగిరి దేవాలయం ఉంది. ఈ కొండలు హైదరాబాదు నుండి ప్రవహిస్తున్న మూసీ నది జన్మస్థానం. ఇవి వికారాబాదుకు 6 కి.మీ దూరంలో ఉంటాయి. ఇక్కడినుండి కాగ్నా నది ప్రవహిస్తోంది. అనంతగిరి కొండల్లో వెలసిన అనంత పద్మనాభ స్వామి దేవాలయంఇది ప్రాచీన ఆవాస ప్రదేశం. ప్రాచీన గుహలు కొన్ని కోటలు, దేవాలయం ఈ ప్రదేశ ఔన్నత్యాన్ని తెలియజేస్తాయి.
మూసీనది హైదరాబాదు నగరానికి 75 కిలోమీటర్లు పశ్చిమాన వికారాబాదు జిల్లా, వికారాబాదు సమీపంలోని అనంతగిరి కొండల్లో పుట్టి నల్గొండ జిల్లా, వాడపల్లి (వజీరాబాద్) వద్ద కృష్ణా నదిలో కలుస్తుంది.. 2,168 అడుగుల ఎత్తులో పుట్టి తూర్పు దిశగా ప్రవహించి హైదరాబాదు గుండా ప్రవహిస్తుంది.
ఈ దేవాలయం అనంతగిరి కోండలలో హైదరాబాదు నగరానికి సుమారు 75 కి.మీ దూరంలో నిర్మితమైనది. ఇది 400 సంవత్సరాల క్రితం నిజాం నవాబుచే నిర్మించబడింది. ఈ దేవాలయంలో ప్రధాన దైవం విష్ణువు “అనంత పద్మనాభస్వామి” రూపంలో ఉంటాడు.అందువలన ఈ ప్రాంతానికి అనంతగిరి అని పేరు వచ్చింది.ఇక్కడి పద్మనాభ ఆలయ చరిత్ర దాదాపు 1300 సంవత్సరాల నాటిది. ఈ ప్రాంతమంతా అప్పట్లో దట్టమైన అడవి. స్థలపురాణం కథనాల ప్రకారం అలనాడు కొండలతో ఉన్న ఈ ప్రాంతంలో మహర్షులు తపస్సు చేసుకునేవారు. ముచుకుందుడనే మహర్షి రాక్షసులతో అనేక సంవత్సరాలు యుద్ధం చేసి వారిని ఓడించాడు. స్వర్గ లోకాధిపతి అయిన దేవేంద్రుడిని కీర్తించి, భూలోకంలో తనకు అలసట తీర్చుకోవడానికి సుఖంగా నిద్రించడానికి కావాల్సిన అహ్లాదకరమైన ప్రశాంత స్థలాన్ని చూపాల్సిందిగా, అంతే కాకుండా తన నిద్రను భంగం చేసినవారు తన తీక్షణమైన చూపులతో భస్మమయ్యేలా వరమి వ్వాలని కోరాడు. దేవేంద్రుడు అనంతగిరి గుహలను చూపించగా ఓ గుహను నివాసంగా చేసుకుని ముచుకుందుడు నిద్రపోయాడు. ముచుకుందుడి చేత శ్రీకృష్ణుడి పాదాలు కడిగిన జలమే జీవనది అయి నేడు ముచుకుందానదిగా ప్రసిద్ధి చెందిందన్న కథనం ప్రచారంలో ఉంది. కాలక్రమేణా మూసీనదిగా మారింది. ఇక్కడ పుట్టిన మూసీ నది హైదరాబాద్‌ మీదుగా నల్లగొండ జిల్లా వాడపల్లి వద్ద కృష్ణానదిలో కలుస్తోంది. అనంతగిరికే మకుటాయమానంగా కనిపించే పద్మనాభ స్వామి ఆలయం దిగువ భాగంలోని ఓ నీటి బుగ్గ నుంచి ముచికుందా నది ప్రవహిస్తోంది. కృష్ణుడు ముచికుందునకు అనంత పద్మనాభస్వామి రూపంలో దర్శనమివ్వడం వల్ల ఈఆలయానికి అనంత పద్మనాభ క్షేత్రంగా పేరు వచ్చిందని స్థల పురాణం చెబుతోంది. ఈ ఆలయం పక్కనే భవనానిశిని అని పిలిచే భగీరథగుండం ఉంది. ఇందులో స్నానం చేస్తే ఆయురారోగ్యాలతోపాటు కోరిన కోర్కెలు నెరవేరుతాయని నమ్మకం జనాల్లో ఉంది.ఇది అనంత పద్మనాభస్వామి దేవాలయం నుండి ఎడమవైపు దారిలో మొదటి కుడివైపు మార్గం గుండా వెలితే అనంతగిరి కొండలన్నిటిని వీక్షించవచ్చు.

అనంతగిరి జల పాతాలు

ఆలయం కుడివైపునకు 2 కి.మీ దూరంలో కొండల మధ్యలోని ఉన్నటువంటి జలపాతాలను చూడవచ్చు.

దామగుండం

వికారాబాద్ కు 10 కి.మీ దూరంలో రామలింగేశ్వర స్వామి ఆలయం ఉన్నది, ఈ ప్రాంతాన్ని దామగుండంగా పిలుస్తారు. ఇక్కడకు చేరుకోవడానికి వికారాబాద్ నుండి చేవెల్ల హైదరాబాదు మార్గంలో కుడివైపున కమాన్ తో కూడిన మహావీర్ హాస్పటల్ రోడ్డు తీసుకుని పూడూరు వైపు లోపలికి సుమారు 10 కి.మీ రావాలి. ఈ మార్గం ఎత్తుపల్లాలతో కొండ ప్రాంతం వలె ఉంటుంది. కొలను మధ్యలో నిర్మించబడిన చిన్న కోవెల ప్రత్యేకాకర్షణగా నిలుస్తుంది.

ఎం రవీందర్
సీనియర్ జర్నలిస్ట్
7901503777