prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 26 May 2026, 6:04 pm Digital Edition : PRAJA KSHETRAM

ఎంజీబీఎస్‌లో ఆర్టీసీ బస్సులో మంటలు.. తప్పిన పెను ప్రమాదం

ఎంజీబీఎస్‌లో ఆర్టీసీ బస్సులో మంటలు.. తప్పిన పెను ప్రమాదం

  • హైదరాబాద్ ఎంజీబీఎస్‌లో ఆర్టీసీ బస్సులో అగ్నిప్రమాదం
  • గద్వాల డిపోకు చెందిన బస్సులో చెలరేగిన మంటలు
  • భయంతో బస్సు దిగి పరుగులు తీసిన ప్రయాణికులు
  • సిబ్బంది అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం

హైదరాబాద్ మే 26(ప్రజాక్షేత్రం):హైదరాబాద్‌లోని మహాత్మా గాంధీ బస్ స్టేషన్ (ఎంజీబీఎస్)లో మంగళవారం ఉదయం పెను ప్రమాదం తప్పింది. ఆగి ఉన్న ఒక ఆర్టీసీ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఆర్టీసీ సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపు చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వివరాల్లోకి వెళితే.. గద్వాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు మహబూబ్‌నగర్, గద్వాల వైపు వెళ్లే ప్లాట్‌ఫామ్‌ వద్ద నిలిపి ఉంది. ప్రయాణికులు బస్సు ఎక్కేందుకు సిద్ధమవుతున్న సమయంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దీంతో బస్సులో ఉన్నవారు, సమీపంలోని ప్రయాణికులు భయంతో కేకలు వేస్తూ పరుగులు తీశారు. సమాచారం అందుకున్న వెంటనే అక్కడే ఉన్న ఆర్టీసీ సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే నీళ్లు చల్లి మంటలు బస్సు మొత్తం వ్యాపించకుండా ఆర్పేశారు. సిబ్బంది సత్వర స్పందనతో ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా పెను ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు. ఈ ఘటనతో ఎంజీబీఎస్‌లో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.