prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 04 May 2026, 10:51 am Digital Edition : PRAJA KSHETRAM

కరీంనగర్‌లో కన్నీటి దృశ్యం.. పండ్లు అమ్మే బండే.. కొడుకు పాడెగా మారింది!

కరీంనగర్‌లో కన్నీటి దృశ్యం.. పండ్లు అమ్మే బండే.. కొడుకు పాడెగా మారింది!

  • కరీంనగర్ జిల్లాలో హృదయ విదారక ఘటన
  • అనారోగ్యంతో మృతిచెందిన కుమారుడు
  • శ‌వాన్ని తోపుడు బండిపై ఇంటికి తరలించిన నిరుపేద తల్లిదండ్రులు

కరీంనగర్ జిల్లా మే 04(ప్రజాక్షేత్రం):కరీంనగర్ జిల్లాలో అత్యంత విషాదకరమైన సంఘటన వెలుగుచూసింది. కన్నకొడుకు అనారోగ్యంతో మృతిచెందగా, ఆ నిరుపేద తల్లిదండ్రులు అతడి మృతదేహాన్ని తమ తోపుడుబండిపైనే తరలించుకోవాల్సి వచ్చింది. ఈ హృదయ విదారక దృశ్యం స్థానికులను కంటతడి పెట్టించింది. వివరాల్లోకి వెళితే… శంకరపట్నం మండలం కేశవపట్నం గ్రామానికి చెందిన ఎల్కపెల్లి వీరయ్య, రుక్కమ్మ దంపతులు తోపుడుబండిపై పండ్లు అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు. వారి కుమారుడు యాకూబ్ (38) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆదివారం సాయంత్రం యాకూబ్ ఆరోగ్యం విషమించడంతో తల్లిదండ్రులు అతడిని తమ రేకుల షెడ్డు వద్దకు తీసుకొచ్చి 108 అంబులెన్స్ కోసం ఫోన్ చేశారు. అయితే, అంబులెన్స్ సిబ్బంది అక్కడికి చేరుకునేసరికే యాకూబ్ ప్రాణాలు విడిచాడు. దీంతో వారు ఏమీ చేయలేక వెనుదిరిగారు. చేసేది లేక, తమ జీవనాధారమైన పండ్ల బండిపైనే కొడుకు మృతదేహాన్ని ఉంచి, ఇంటికి తరలించారు. కళ్లెదుటే జరిగిన ఈ విషాద ఘటనను చూసిన స్థానికులు చలించిపోయారు.