prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 19 May 2026, 12:03 pm Digital Edition : PRAJA KSHETRAM

న్యాయం కోసం వెళ్తే అన్యాయం.. వివాహితను గర్భవతిని చేసిన ఖమ్మం సీఐ

న్యాయం కోసం వెళ్తే అన్యాయం.. వివాహితను గర్భవతిని చేసిన ఖమ్మం సీఐ

– భర్తపై ఫిర్యాదుకు వచ్చిన మహిళను లోబర్చుకున్న సీఐ రాజు నాయక్

– పెళ్లి పేరుతో గర్భవతిని చేసి, బలవంతంగా అబార్షన్ చేయించిన వైనం

– బాధితురాలి ఫిర్యాదుతో సీఐపై కేసు నమోదు, ముందస్తు బెయిల్

– విచారణలో ఆరోపణలు నిజమేనని తేలడంతో డీజీపీ ఆఫీస్‌కు అటాచ్

హైదరాబాద్ మే 19(ప్రజాక్షేత్రం):ఖమ్మం కమిషనరేట్‌లో పనిచేస్తున్న సీఐ భూక్యా రాజు నాయక్‌ను పోలీసు ఉన్నతాధికారులు హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు. భర్తపై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ఓ మహిళను పెళ్లి పేరుతో లోబర్చుకుని, గర్భవతిని చేసి, వేధించినట్లు ఆయనపై తీవ్ర ఆరోపణలు రావడంతో ఈ చర్యలు తీసుకున్నారు. ఈ కేసులో ప్రాథమిక విచారణలో ఆరోపణలు నిజమేనని తేలడంతో రాజు నాయక్‌పై బదిలీ వేటు పడింది. 2023లో ఖమ్మం మహిళా పోలీస్ స్టేషన్‌లో రాజు నాయక్ సీఐగా ఉండగా ఓ మహిళ తన భర్త వేధిస్తున్నాడని ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు నుంచి ఫోన్ నంబర్ తీసుకున్న సీఐ, న్యాయం చేస్తానని నమ్మించి తరచూ ఫోన్లు, మెసేజ్‌లు చేయడం ప్రారంభించాడు. అనంతరం పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి ఆమెను లోబర్చుకున్నాడు. ఈ క్రమంలో బాధితురాలు గర్భం దాల్చడంతో తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసింది. అయితే, సీఐ ఆమెకు బలవంతంగా కొన్ని ట్యాబ్లెట్లు మింగించడంతో గర్భస్రావం అయిందని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. ఆ తర్వాత కూడా పెళ్లి విషయాన్ని దాటవేస్తుండటంతో విసిగిపోయిన ఆమె ఈ నెల 7న ఖమ్మం టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు కావడంతో సీఐ రాజు నాయక్ పరారీలోకి వెళ్లి, ఇటీవల ముందస్తు బెయిల్ పొందినట్లు సమాచారం. మరోవైపు, ఈ ఘటనపై జరిగిన అంతర్గత విచారణలో సీఐ వేధింపులకు పాల్పడినట్లు తేలడంతో ఉన్నతాధికారులు అతడిని డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. బాధితురాలికి ఇటీవలే ఆమె భర్త నుంచి కోర్టు ద్వారా విడాకులు మంజూరయ్యాయి. ఆమెకు విడాకులు ఇప్పించేందుకు సీఐ రాజు నాయక్ ఆమె భర్తపై ఒత్తిడి తెచ్చినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి.