ప్రేమజంటను బెదిరించి బాలికపై సామూహిక అత్యాచారం
వికారాబాద్ బ్యూరో 03(ప్రజాక్షేత్రం):ఏకాంతంగా ఉన్న మైనర్ ప్రేమజంటను బెదిరించి, బాలికపై ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి ప్రియుడు వెంటనే డయల్ 100కు సమాచారం ఇవ్వడంతో పోలీసులు నిందితులను ఘటనాస్థలంలోనే పట్టుకున్నారు. మహబూబ్నగర్ జిల్లా హన్వాడలో జరిగిందీ ఘటన.
వికారాబాద్ జిల్లా పరిగికి చెందిన 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని, ఆమె ప్రియుడు శుక్రవారం సాయంత్రం మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండలం పిల్లిగుండు తండా సమీపంలోని అటవీ ప్రాంతానికి వెళ్లారు. వారిని గమనించిన మహబూబ్నగర్కు చెందిన అశోక్, లక్ష్మణ్ అనే ఇద్దరు యువకులు వారిని అడ్డగించారు. మొదట ప్రేమజంటను బెదిరించి వారి వద్ద నుంచి రూ.6,000 నగదు వసూలు చేశారు. అనంతరం ప్రియుడిని భయపెట్టి పక్కకు నెట్టి, బాలికపై అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ సమయంలో ప్రియుడు ధైర్యం చేసి డయల్ 100కు ఫోన్ చేయడంతో పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, నిందితులను రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. కాగా, ఈ ప్రాంతంలో గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయని, పోలీసులు నిఘా పెంచాలని స్థానికులు కోరుతున్నారు.