prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 23 May 2026, 6:54 pm Digital Edition : PRAJA KSHETRAM

మల్కాపూర్ రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన మాజీ వైస్ ఎం.పీ.పీ వర్ధంతి

మల్కాపూర్ రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన మాజీ వైస్ ఎం.పీ.పీ వర్ధంతి

  • మరణించి రెండు దశబ్దాలు గడిచినా ఇప్పటికి చెరగని ముద్ర
  • ⁠గ్రామంలో ఓటమి ఎరుగని ప్రజానాయకుడు
  • ⁠సర్పంచుగా, వైస్ ఎంపిపిగా చిరస్మరణీయ సేవలు
  • ⁠తండ్రి ఆశయాల వారసత్వంలో కుమారుడు ప్రవీణ్

కొండాపూర్, మే 23(ప్రజాక్షేత్రం):
సుమారు 18 సంవత్సరాల పాటు మల్కాపూర్ గ్రామ రాజకీయాలను శాసించి, కొండాపూర్ మండలంలో ప్రముఖ కాంగ్రెస్ నాయకునిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దివంగత కొండాపూర్ మాజీ వైస్ ఎంపిపి, మల్కాపూర్ మాజీ సర్పంచ్ జోగన్నగారి నర్సింలు 20వ వర్ధంతి సందర్భంగా మల్కాపూర్ ప్రజలు ఆయన సేవలను స్మరించుకుంటున్నారు. 2006 మే 24న యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో ఆయన గుండెపోటుతో పరమపదించిన సంగతి తెలిసిందే. ఆయన మరణించి రెండు దశాబ్దాలు కావస్తున్నా, నేటికీ మల్కాపూర్ ప్రజల గుండెల్లో చెరగని ముద్రతో నిలిచే ఉన్నారు. సాధారణ కుటుంబం నుండి అసాధారణ నాయకుడిగా.. 1952లో పద్మశాలి కులానికి చెందిన వ్యవసాయ కూలీలుగా పనిచేసే లక్ష్మయ్య, లక్ష్మమ్మ దంపతుల ద్వితీయ సంతానంగా నర్సింలు గారు జన్మించారు. సంగారెడ్డిలో మెట్రిక్యులేషన్ పూర్తి చేసిన ఆయన, శ్రీమతి వెంకటమ్మ గారిని వివాహం చేసుకున్నారు. వీరికి నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు (ప్రవీణ్ ప్రస్తుత ఉపసర్పంచ్) ఉన్నారు. మొదట మల్కాపూర్ పోలీస్ పటేల్‌గా, ఆ తర్వాత పట్వారీగా కొన్ని సంవత్సరాలు సేవలు అందించిన నర్సింలు, ఆ తర్వాత ప్రజా జీవితంలోకి అడుగుపెట్టారు.
ప్రజల ఆశీస్సులతో విజయ పరంపర

  • 1988: గ్రామపంచాయతి సాధారణ ఎన్నికలలో మల్కాపూర్ గ్రామ సర్పంచ్‌గా భారీ విజయంతో రాజకీయ ప్రస్థానం ప్రారంభం.
  • ⁠1995: మెరుగైన పాలనతో గుర్తింపు తెచ్చుకుని, తన సహచరిణి శ్రీమతి వెంకటమ్మ గారిని మల్కాపూర్ తొలి మహిళా సర్పంచ్‌గా భారీ మెజారిటీతో గెలిపించారు.
  • ⁠2001: మల్కాపూర్ మరియు గిర్మాపూర్ గ్రామాల నుండి కాంగ్రెస్ ఎం.పీ.టీ.సీ (MPTC) గా విజయం సాధించి, కొండాపూర్ మండల వైస్ ఎం.పీ.పీ పదవిని అధిష్టించారు.
    గ్రామ అభివృద్ధిలో మైలురాళ్ళు..
    ఆయన పదవీకాలంలో మల్కాపూర్ రూపురేఖలు మారిపోయాయి. తాగునీటి ఇబ్బందులు తొలగించేందుకు మంచినీటి ట్యాంకుల నిర్మాణం, బోర్లు వేయించి ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్ ఇప్పించారు. కొత్త రోడ్ల నిర్మాణం, మురుగునీటి కాలువలు, విద్యుత్ సౌకర్యం కోసం ప్రత్యేకంగా సబ్‌స్టేషన్ ఏర్పాటు చేయించారు. అంతేకాకుండా, గ్రామస్తుల సహకారంతో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల కోసం ఒక ఎకరం స్థలాన్ని సమీకరించి విద్యాభివృద్ధికి బాటలు వేశారు. ఎన్నో ఆటంకాలను ఎదుర్కొని ఆమ్లెట్ గ్రామమైన వీరభద్రుని పల్లెకు రోడ్డు నిర్మాణం పూర్తి చేశారు.
    ముక్కుసూటి తనం.. న్యాయానికే పీఠం
    గ్రామంలో ఎలాంటి తగాదాలు జరిగినా పోలీస్ స్టేషన్ వరకు వెళ్లకుండా ఊర్లోనే పరిష్కరించేవారు. పంచాయితీల్లో ముక్కుసూటిగా మాట్లాడుతూ, కేవలం న్యాయం వైపు మాత్రమే నిలబడేవారు. తన హయాంలో పేదలకు సంపూర్ణ న్యాయం జరిగిందని, వారి జీవితాలు మెరుగయ్యాయని ఇప్పటికీ గ్రామ ప్రజలు గుర్తుచేసుకుంటుంటారు.
  • తండ్రి ఆశయాల సాధనలో కుమారుడు ‘ప్రవీణ్’:
    జోగన్నగారి నర్సింలు గారి ఆశయాలను, ఆశీస్సులను ముందుకు తీసుకెళ్లేందుకు ఆయన కుమారుడు ప్రవీణ్ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఐటీ రంగంలో మంచి భవిష్యత్తు ఉన్నప్పటికీ, దాదాపు 16 సంవత్సరాల అనుభవం కలిగిన ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ ‘కాగ్నిజెంట్’ (Cognizant) మేనేజర్ ఉద్యోగానికి రాజీనామా చేసి మల్కాపూర్ ప్రజాసేవకు అంకితమయ్యారు. గత నాలుగేళ్లుగా ప్రజల్లోనే ఉంటూ సేవ చేస్తున్న ప్రవీణ్, ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ స్థానం రిజర్వేషన్ కలిసిరాకపోయినప్పటికీ, తండ్రిలాగే గ్రామానికి సేవ చేయాలనే పట్టుదలతో వార్డు సభ్యుడిగా పోటీ చేసి, ఆపై మల్కాపూర్ ఉపసర్పంచ్‌గా ఎన్నికై తండ్రికి తగ్గ తనయుడిగా నిలిచారు. జోగన్నగారి నర్సింలు 20వ వర్ధంతి సందర్భంగా మల్కాపూర్ గ్రామస్తులు, నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించనున్నారు.