రూ.1000 లంచానికి లక్ష బహుమతి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం
నేషనల్ బ్యూరో మే 19(ప్రజాక్షేత్రం):ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిని పూర్తిగా నిర్మూలించడానికి తమిళనాడు ప్రభుత్వం ఒక సరికొత్త విప్లవాత్మక ప్రోత్సాహక పథకాన్ని అధికారికంగా ప్రకటించింది. ఈ నూతన విధానం ప్రకారం రాష్ట్రంలోని ఏ ప్రభుత్వ శాఖలోనైనా సరే అధికారులు లేదా సిబ్బంది మీ నుండి కేవలం 1000 రూపాయల లంచం డిమాండ్ చేసినా పౌరులు సాక్ష్యాధారాలతో స్వేచ్ఛగా ఫిర్యాదు చేయవచ్చు. లంచాలు అడిగే అధికారులపై సరైన ఆధారాలతో ఫిర్యాదు చేసి అవినీతి నిరోధక శాఖకు పట్టిచ్చిన పౌరులకు ప్రభుత్వం తరఫున ఏకంగా 1,00,000 రూపాయల నగదు బహుమతి ఇస్తామని ముఖ్యమంత్రి సంచలన ప్రకటన చేశారు. ఈ అవినీతి నిరోధక ఫిర్యాదుల కోసం 24 గంటలూ అందుబాటులో ఉండేలా 1800 425 1555 అనే ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్ను కూడా ప్రభుత్వం రంగంలోకి దించింది. సామాన్య ప్రజలను నేరుగా భాగస్వాములను చేస్తూ తమిళనాడు సర్కార్ తీసుకున్న ఈ అసాధారణ నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ పథకం ద్వారా లంచగొండితనానికి పూర్తిగా అడ్డుకట్ట పడుతుందని, నిరుపేదలకు ప్రభుత్వ సేవలు సకాలంలో అందుతాయని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.