రూ.2లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మహిళా తహసీల్దార్
మేడ్చల్ మే 26(ప్రజాక్షేత్రం):రాష్ట్రంలో మరో అవినీతి అధికారిణి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. సోమవారం ఇద్దరు, మంగళవారం మరో ఇద్దరు అధికారులకు చిక్కడంతో ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. మేడ్చల్, మల్కాజిగిరి జిల్లా శామీర్పేట మండలానికి చెందిన తహసీల్దార్ టి.సుచరిత రెండు లక్షల రూపాయలు తీసుకుంటూ ఏసీబీకి రెడ్హ్యండెడ్గా పట్టుబడ్డారు. ఈ కేసులో ఆమె డ్రైవర్ వి నాగేష్ను కూడా అరెస్టు చేశారు. 30 ఎకరాల వ్యవసాయ భూమిలో నాలా కన్వర్షన్ కోసం దరఖాస్తును ఆమోదించాలని తహసీల్దార్ను కోరగా అందుకు రూ.30లక్షలు డిమాండ్ చేశారు. దీంతో ఫిర్యాదుదారుడు ఏసీబీని ఆశ్రయించగా మంగళవారం మధ్యాహ్నం కార్యాలయంలో తహసీల్దార్ ప్రైవేట్ డ్రైవర్ నాగేష్కు రూ.2లక్షలు అందజేశాడు. డ్రైవర్ ఆ డబ్బును తహసీల్దార్ సుచరితకు ఇస్తుండగానే మాటు వేసిన ఏసీబీ అధికారులు దాడులు చేసి లంచం డబ్బును పట్టుకున్నారు. ఆమెతో పాటు డ్రైవర్పై కేసు నమోదు చేసి నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు.