లంచం తీసుకుంటూ ఎసిబికి చిక్కిన సర్వేయర్
మహబూబ్నగర్ మే 26(ప్రజాక్షేత్రం):భూములకు సంబంధించి ఒక రైతుకు అనుకూలంగా సర్వే చేయడానికి లంచం డిమాండ్ చేసిన గద్వాల జిల్లా వడ్డేపల్లి మండల సర్వేయర్ బ్రహ్మయ్య మంగళవారం ఎసిబి అధికారుల దాడిలో పట్టుబడ్డారు. మండలంలోని ఒక రైతుకు సంబంధించిన మొత్తం నాలుగెకరాల పొలాన్ని సర్వే చేయడానికి ఎకరానికి రూ.5 వేల చొప్పున మొత్తం రూ.20 వేలు ఇవ్వాలని సర్వేయర్ బ్రహ్మయ్య సదరు రైతుపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. ఇందులో భాగంగా రైతు నుంచి గతంలోనే అడ్వాన్స్గా రూ.5 వేలు తీసుకున్నాడు. మిగతా డబ్బులు ఇస్తేనే పొలం సర్వే చేస్తానని, లేదంటే కుదరదని సర్వేయర్ మొండికేయడంతో విసిగిపోయిన బాధిత రైతు మహబూబ్నగర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు మహబూబ్నగర్ ఎసిబి డీఎస్పీ బాలకృష్ణ సారథ్యంలో ఎసిబి బృందం వడ్డేపల్లిలో నిఘా పెట్టింది. రైతు నుంచి సర్వేయర్ బ్రహ్మయ్య రూ.10 వేల లంచం తీసుకుంటుండగా ఎసిబి అధికారులు దాడిచేశారు. రసాయన పరీక్షలతో సహా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. లంచం సొమ్మును స్వాధీనం చేసుకొని, నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు డీఎస్పీ బాలకృష్ణ తెలిపారు.