prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 06 May 2026, 6:26 pm Digital Edition : PRAJA KSHETRAM

సామాన్య మహిళగా బస్టాండ్‌లో సీపీ సుమతి… పోకిరీల ఆటకట్టు

సామాన్య మహిళగా బస్టాండ్‌లో సీపీ సుమతి… పోకిరీల ఆటకట్టు

మల్కాజిగిరి మే 06(ప్రజాక్షేత్రం):మల్కాజిగిరి పోలీస్ కమిషనర్‌గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన బి. సుమతి ఆకతాయిల ఆగడాలపై ఉక్కుపాదం మోపారు. ఈవ్ టీజింగ్‌ను అరికట్టేందుకు తానే స్వయంగా రంగంలోకి దిగి, అర్ధరాత్రి ఓ బస్టాండ్‌లో సామాన్య మహిళగా నిలబడ్డారు. ఆమెను గుర్తుపట్టని పోకిరీలు వేధించడంతో, అక్కడే మాటువేసిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. మంగళవారం అర్ధరాత్రి మల్కాజిగిరి పరిధిలోని ఓ బస్టాండ్‌కు సీపీ సుమతి ఒంటరిగా చేరుకున్నారు. ఆమె ఉన్నతాధికారి అని తెలియని సుమారు 40 మంది పోకిరీలు ఆమె చుట్టూ చేరారు. రకరకాల ప్రశ్నలతో ఇబ్బంది పెట్టారు. ఈ క్రమంలో సాధారణ మహిళలు ఎదుర్కొనే వేధింపులను ఆమె స్వయంగా అనుభవించారు. పట్టుబడిన వారిలో ఎక్కువ మంది విద్యార్థులే ఉండటం ఆందోళన కలిగించే విషయం. ఆకతాయిల వేధింపులు శ్రుతి మించడంతో అక్కడికి చేరుకున్న ప్రత్యేక పోలీస్ బృందాలు వారిని అదుపులోకి తీసుకున్నాయి. అనంతరం యువకులందరికీ కౌన్సెలింగ్ ఇచ్చి, భవిష్యత్తులో ఇలాంటి పనులకు పాల్పడవద్దని హెచ్చరించి పంపించారు. మహిళల భద్రత విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని సీపీ సుమతి ఈ ఆపరేషన్ ద్వారా స్పష్టమైన సంకేతాలు పంపారు.