కదులుతున్న ‘నరహరి’ అవినీతి డొంక..
- బ్యాంక్ లాకర్లో రూ. 1.50 కోట్ల నగదు గుర్తింపు!
- శాలిబండ కెనరా బ్యాంక్లో లాకర్లు తెరిచిన ఏసీబీ అధికారులు
- ఇంకా తెరవాల్సి ఉన్న మరో రెండు లాకర్లు.. మరింత అక్రమాస్తి బయటపడే ఛాన్స్!
- నోట్ల కట్టలు చూసి అధికారులే షాక్!!
హైదరాబాద్ జూన్ 20(ప్రజాక్షేత్రం):హైదరాబాద్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ విభాగం (మల్టీ జోన్-II) డిప్యూటీ డైరెక్టర్గా పనిచేస్తూ అక్రమాస్తుల కేసులో ఏసీబీకి చిక్కిన సుంకరి నరహరి రావు అవినీతి సామ్రాజ్యం రోజురోజుకూ మరిన్ని విస్తుపోయే నిజాలను బయటపెడుతోంది. ఆయన ఆస్తులపై నిరంతర దర్యాప్తు సాగిస్తున్న అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు శనివారం నరహరి రావుకు సంబంధించిన బ్యాంక్ లాకర్లపై సోదాలు నిర్వహించారు.
నోట్ల కట్టలు చూసి అధికారులే షాక్
హైదరాబాద్ పాతబస్తీ శాలిబండలోని కెనరా బ్యాంక్ శాఖలో నరహరి రావు (ఆయన భార్య పేరుతో) నిర్వహిస్తున్న ఒక బ్యాంక్ లాకర్ను ఏసీబీ అధికారులు ఈరోజు సమక్షంలో తెరిపించారు. అందులో గుట్టలుగా దాచి ఉంచిన సుమారు రూ. 1.50 కోట్ల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే గతంలో జరిపిన తనిఖీల్లో కోట్ల విలువైన ఆస్తులు, నగదు లభించగా, తాజా లాకర్ల సోదాల్లో మరిన్ని నిధులు వెలుగుచూడటం సంచలనంగా మారింది.
మరో రెండు లాకర్లపై సస్పెన్స్
ఈ దర్యాప్తులో భాగంగా నరహరి రావుకు సంబంధించిన మరో రెండు బ్యాంక్ లాకర్లను కూడా అధికారులు గుర్తించారు. ఆ లాకర్లను ఇంకా తెరవాల్సి ఉందని, వాటిని కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత అక్రమాస్తుల పూర్తి విలువపై స్పష్టత వస్తుందని ఏసీబీ ఉన్నతాధికారులు వెల్లడించారు. ప్రస్తుతం చంచల్గూడ జైల్లో రిమాండ్లో ఉన్న నరహరి రావుపై ఆదాయానికి మించిన ఆస్తుల (DA Case) కింద కేసును మరింత పటిష్టం చేసేందుకు ఈ ఆధారాలు కీలకపాత్ర పోషిస్తాయని అధికారులు స్పష్టం చేశారు.