prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 06 June 2026, 9:14 am Digital Edition : PRAJA KSHETRAM

జోరుగా డబుల్ బెడ్ రూమ్ దందా!!

జోరుగా డబుల్ బెడ్ రూమ్ దందా!!

  • కనీస బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.
  • పేదల కోసం నిర్మించిన గృహాలు కొందరికి ఆదాయ వనరులుగా మారాయా.?
  • అధికారుల తనిఖీలకే ముందస్తు సమాచారం ఎలా చేరుతోంది?
  • రాష్ట్ర వ్యాప్తంగా ఇదే తరహాలో దందా జోరు.?
  • వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజల డిమాండ్.

హైదరాబాద్ జూన్ 06(ప్రజాక్షేత్రం):పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్‌రూం గృహాలు రాష్ట్రవ్యాప్తంగా అక్రమ దందాలకు కేంద్రాలుగా మారుతున్నాయనే ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి. కొల్లూరు డబుల్ బెడ్‌రూం కాలనీల్లో వెలుగుచూస్తున్న ఆరోపణలు కేవలం ఒక ప్రాంతానికే పరిమితం కాకుండా, రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇదే తరహా పరిస్థితులు ఉన్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం వేల కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన డబుల్ బెడ్‌రూం ఇళ్లను అర్హులైన పేదలకు ఉచితంగా కేటాయించింది. అయితే నిబంధనలకు విరుద్ధంగా కొందరు లబ్ధిదారులు, మధ్యవర్తులు, స్థానిక ప్రభావశీలుల అండతో ఈ ఇళ్లను అమ్మడం, అద్దెకు ఇవ్వడం, ఇతరులకు బదిలీ చేయడం వంటి అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ అవసరాలు, ఉద్యోగాల కారణంగా ఇతర ప్రాంతాలకు వెళ్లిన లబ్ధిదారులను లక్ష్యంగా చేసుకుని కొందరు బ్రోకర్లు ఈ అక్రమ వ్యాపారాన్ని నడుపుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు వ్యాపారంగా మార్చి లక్షల రూపాయలు చేతులు మారుతున్నాయనే ఆరోపణలు ప్రజల్లో ఆగ్రహం రేకెత్తిస్తున్నాయి. అత్యంత ఆందోళనకరమైన విషయం ఏమిటంటే, కేటాయించిన ఇళ్లలో అసలు లబ్ధిదారులు నివసిస్తున్నారా లేదా అనే విషయాన్ని పర్యవేక్షించాల్సిన వ్యవస్థ పూర్తిగా బలహీనపడిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని చోట్ల తనిఖీల సమాచారం ముందుగానే చేరడంతో అక్రమాలు బయటపడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పేదల కోసం ఉద్దేశించిన సంక్షేమ పథకాలు కొందరి చేతుల్లో అక్రమ సంపాదనకు మార్గంగా మారితే ప్రభుత్వ లక్ష్యమే దెబ్బతింటుందని సామాజిక వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా డబుల్ బెడ్‌రూం కాలనీలపై ప్రత్యేక సర్వే నిర్వహించి, అక్రమంగా విక్రయించిన లేదా అద్దెకు ఇచ్చిన ఇళ్లను గుర్తించాలని డిమాండ్ చేస్తున్నారు. అర్హులైన పేదలకు చేరాల్సిన ఇళ్లు అక్రమంగా ఇతరుల చేతుల్లోకి వెళ్లకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసి ప్రతి డబుల్ బెడ్‌రూం కాలనీపై సమగ్ర విచారణ జరపాలని ప్రజలు కోరుతున్నారు.