prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 13 June 2026, 4:59 pm Digital Edition : PRAJA KSHETRAM

భారీ వర్షానికి జలమయమైన శంకర్ పల్లి రహదారులు

భారీ వర్షానికి జలమయమైన శంకర్ పల్లి రహదారులు

  • అక్రమ కట్టడాల వల్లే సమస్యలు పెరిగాయంటున్న ప్రజలు

శంకర్ పల్లి, జూన్ 13(ప్రజాక్షేత్రం):శంకర్ పల్లి మండలంలో కురిసిన భారీ వర్షానికి ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీగా చేరుకున్న వర్షపు నీరు, రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ నెమ్మదించి కొంతసేపు స్తంభించిన పరిస్థితి నెలకొంది. వర్షపు నీటి కాలువలు ఆక్రమణలకు గురికావడం, అనుమతులు లేకుండా నిర్మించిన అక్రమ కట్టడాల కారణంగానే నీరు సక్రమంగా వెళ్లక రోడ్లపై నిలిచిపోతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. వర్షాకాలం ప్రారంభానికి ముందే డ్రైనేజీలు, కాలువలను శుభ్రపరచడంతో పాటు ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అధికారులు నిర్లక్ష్యం వహించారని ప్రజలు విమర్శిస్తున్నారు. ప్రతి ఏడాది ఇదే పరిస్థితి పునరావృతమవుతున్నప్పటికీ సమస్యల పరిష్కారానికి శాశ్వత చర్యలు తీసుకోకపోవడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖల అధికారులు స్పందించి కాలువల ఆక్రమణలను తొలగించి, వర్షపు నీరు సాఫీగా వెళ్లేలా చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అధికారులు అప్రమత్తంగా వ్యవహరించి వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.