prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 04 June 2026, 12:07 pm Digital Edition : PRAJA KSHETRAM

రోడ్డు పక్కల గుంతలు ప్రజల ప్రాణాలకు ఉచ్చు

రోడ్డు పక్కల గుంతలు ప్రజల ప్రాణాలకు ఉచ్చు

  • దామర్లపల్లి – చేగూర్ మార్గంలో పెరుగుతున్న ప్రమాదాలు
  • పర్యావరణానికి ముప్పుగా మారిన తవ్వకాలు -బి ఆర్ ఎస్ నాయకుడు కర్రె శ్రీశైలం

షాబాద్, జూన్ 04(ప్రజాక్షేత్రం):షాబాద్ మండలంలోని దామరపల్లి గ్రామం నుంచి చేగూర్ గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి ఇరువైపులా కొన్ని ప్రైవేట్ కంపెనీలు యథేచ్ఛగా తవ్వకాలు నిర్వహిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయని బీఆర్ఎస్ నాయకుడు కర్రె శ్రీశైలం తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధి పనుల పేరుతో రహదారి పక్కలను లోతుగా తవ్వడం వల్ల ప్రయాణికులు నిత్యం ప్రమాదాల బారిన పడుతున్నారని, ఇప్పటికే అనేక రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుని పలువురు గాయపడటమే కాకుండా కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారని తెలిపారు. అంతేకాకుండా రహదారి పక్కన ఉన్న విలువైన చెట్ల వేర్ల వరకు జేసీబీలతో తవ్వడం వల్ల చెట్లు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రజల భద్రత, పర్యావరణ పరిరక్షణను పూర్తిగా విస్మరించి కంపెనీలు వ్యవహరిస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం బాధాకరమని విమర్శించారు. దామరపల్లి గ్రామ ప్రజలు, పరిసర గ్రామాల ప్రజలు, నిత్యం ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారని పేర్కొన్నారు. వెంటనే అధికారులు స్పందించి అక్రమ తవ్వకాలను నిలిపివేసి, రహదారి భద్రతకు చర్యలు తీసుకోవడంతో పాటు చెట్ల సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కర్ర శ్రీశైలం డిమాండ్ చేశారు. “అభివృద్ధి అంటే ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టడం కాదు.. ప్రజల భద్రతకు భరోసా కల్పించడమే నిజమైన అభివృద్ధి” అని ఆయన అన్నారు.