prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 01 June 2026, 2:43 pm Digital Edition : PRAJA KSHETRAM

సీఎం సభకు బస్సులు భైంసా బస్టాండ్‌లో ప్రయాణికుల అవస్థలు

సీఎం సభకు బస్సులు భైంసా బస్టాండ్‌లో ప్రయాణికుల అవస్థలు

నిర్మల్ జిల్లా జూన్ 01(ప్రజాక్షేత్రం):ముఖ్యమంత్రి సభకు ఆర్టీసీ బస్సులను పెద్ద ఎత్తున తరలించడంతో భైంసా బస్టాండ్‌లో సోమవారం ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సోమవారం సంత కావడంతో మండలంలోని వివిధ గ్రామాలతో పాటు పరిసర ప్రాంతాల నుంచి ప్రజలు భారీ సంఖ్యలో భైంసాకు తరలివచ్చారు. అయితే బస్సుల కొరత కారణంగా ప్రయాణికులు గంటల తరబడి బస్టాండ్‌లో వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. సంత పనుల కోసం వచ్చిన రైతులు, మహిళలు, విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు రవాణా సౌకర్యం లేక తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. కొన్ని రూట్లలో బస్సులు అందుబాటులో లేకపోవడంతో ప్రయాణికులు ప్రత్యామ్నాయ వాహనాలను ఆశ్రయించాల్సి వచ్చింది. దీంతో అదనపు ఖర్చుతో పాటు సమయ నష్టం కూడా కలిగిందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు. భైంసా బస్టాండ్‌లో ప్రయాణికులతో కిక్కిరిసిన దృశ్యాలు కనిపించాయి. బస్సులు రాగానే ప్రయాణికులు ఎక్కేందుకు పోటీ పడడంతో కొంత గందరగోళ వాతావరణం నెలకొంది. ప్రజల రద్దీని దృష్టిలో ఉంచుకుని తాత్కాలికంగా అదనపు బస్సులను ఏర్పాటు చేయాలని ప్రయాణికులు ఆర్టీసీ అధికారులను కోరుతున్నారు.