prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 24 June 2026, 6:56 pm Digital Edition : PRAJA KSHETRAM

సీటు కోసం రణరంగంగా మారిన ఆర్టీసీ బస్సు..

సీటు కోసం రణరంగంగా మారిన ఆర్టీసీ బస్సు.. జుట్లు పట్టుకుని కొట్టుకున్న మహిళలు!

ఖమ్మం జూన్ 24(ప్రజాక్షేత్రం):మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించినప్పటి నుండి సీట్ల కోసం జరుగుతున్న గొడవలు నిత్యకృత్యంగా మారాయి. తాజాగా ఖమ్మం జిల్లాలో సీటు కోసం మహిళలు ఏకంగా బస్సులోనే కొట్టుకున్న ఘటన తీవ్ర కలకలం రేపింది. తోటి ప్రయాణికులు ఆపుతున్నా వినకుండా రణరంగం సృష్టించారు. మధిర డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు మధిర నుండి ఖమ్మం వైపు వెళ్తోంది. బస్సులో ప్రయాణికుల రద్దీ చాలా ఎక్కువగా ఉంది. వైరా మండలం పాలడుగు గ్రామ సమీపంలోకి రాగానే బస్సు ఎక్కిన ఒక కుటుంబానికి చెందిన వ్యక్తికి సీటు దక్కలేదు. దీంతో ఆ కుటుంబానికి చెందిన మహిళ.. పక్కనే కూర్చున్న ఇతర మహిళలతో సీటు విషయంలో వాగ్వాదానికి దిగింది. నాదంటే నాది అంటూ ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగింది. ఈ ఘర్షణ కాస్తా ముదిరి పరస్పరం దాడులు చేసుకునే వరకు వెళ్లింది. సీట్లపైనే ఒకరినొకరు తోసుకుంటూ, జుట్టు జుట్టు పట్టుకుని తీవ్రస్థాయిలో కొట్టుకున్నారు. మహిళల మధ్య తోపులాట చూసి తోటి ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. చివరకు ఆర్టీసీ బస్సు సిబ్బందితో పాటు ప్రయాణికులు జోక్యం చేసుకుని తీవ్రంగా శ్రమించి వారిని శాంతింపజేశారు. ఈ రచ్చ కారణంగా బస్సు ప్రయాణం కొంతసేపు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీనికి సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.