అభివృద్ధి జాడెక్కడ
- అభివృద్ధికి ఒక్క అడుగు పడితే ఒట్టు
- రెండేళ్లు కావస్తున్న వట్ పల్లి మార్కెట్ కమిటీ పాలక వర్గ పదవికాలం
- నిధులు మంజురైనా పనులు సున్నా
- తీర్మానలకే పరిమితమైన పాలక వర్గ సమావేశాలు
- అక్టోబర్ లో ముగియనున్న పదవి కాలం
అందోల్ జులై 27(ప్రజాక్షేత్రం):సంగారెడ్డి జిల్లా అందోల్ నియోజకవర్గం వట్ పల్లి మార్కెట్ యార్డుకు ధాన్యాన్ని తీసుకొచ్చే రైతులకు సరైన ధరలు దక్కేలా చర్యలు తీసుకోవడంతో పాటు మార్కెట్యార్డులో సదుపాయాలు కల్పించడానికి మార్కెట్ కమిటీలు పనిచేస్తాయి. దీనిలో భాగంగానే 2024 అక్టోబర్లో వట్పల్లి మార్కెట్యార్డు నూతన పాలకవర్గాన్ని ఏర్పాటు చేశారు. యార్డులో నెలకొన్న పలు సమస్యలు, అభివృద్ధి పనుల నిర్వహణపై దృష్టి సారించి పాలకవర్గ సమావేశం నిర్వహించి తీర్మానించారు. ఆ తర్వాత పాలకవర్గం మరో ఐదు సమావేశాలు నిర్వహించినప్పటికీ అవే సమస్యలు, అవే తీర్మానాలపై చర్చించారు తప్ప కొత్తగా చేసిందేమిలేదని, తీర్మానించిన ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమానికి అడుగుపడలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల మంత్రి దామోదర మార్కెట్ యార్డు ఆవరణలో పోలీస్టేషన్, తహసీల్దారు, ఎంపీడీఓ కార్యాలయాల నిర్మాణాలకు సంబంధించి స్థలాన్ని పరిశీలించి ఖరారు చేయడంతో దీనిపై ఈ నెల 24న పాలకవర్గం సమావేశమై తీర్మానించింది. అలాగే ఇతర అభివృద్ధి పనుల నిర్వహణపై చర్చించలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా పదవీకాలం మూడు నెలలు మాత్రమే ఉందని.. ఇప్పటికే అభివృద్ధి పనులపై చేసినతీర్మానాలు అమలుకు నోచుకోలేదని సమావేశానికి ముందు సభ్యులు అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ప్రస్తుత పాలకవర్గ పదవీకాలం అక్టోబర్లో ముగియనుంది.
నిధులు మంజూరైనా.. పనులు సున్నా
మార్కెట్యార్డు ఆవరణలో పలు అభివృద్ధి పనులు చేసేందుకు ప్రభుత్వం సుమారు రూ.71 లక్షల నిధులను గతేడాది జూలైలో మంజూరు చేసింది. ఆరు షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం కోసం రూ.43 లక్షలు, ఆర్వో ఫ్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్కు రూ. 8 లక్షలు, కంపౌండ్ వాలుకు రూ.20 లక్షల నిధులు మంజూరు కాగా టెండర్లను కూడా పూర్తి చేశారు. కానీ ఇప్పటి వరకు పనులు ప్రారంభం కాలేదు.