prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 25 July 2026, 12:12 pm Digital Edition : mohan.sabbasani@gmail.com

‘గోవింద’ నామస్మరణతో మారుమోగిన వెంకులోని గుట్ట

‘గోవింద’ నామస్మరణతో మారుమోగిన వెంకులోని గుట్ట

కీసర, జూలై 25(ప్రజా క్షేత్రం):
మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలోని కీసర మండలం రాంపల్లి దయారా గ్రామంలోని వెంకులోని గుట్టపై వెలసిన హేమాద్రి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో తొలి ఏకాదశి మహోత్సవం శనివారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచే వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. విశేష అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు, భజన కార్యక్రమాల్లో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఆలయ ప్రాంగణం అంతా “గోవింద… గోవింద…” నామస్మరణతో మారుమోగింది.
ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వరస్వామి అనుగ్రహంతో రాష్ట్ర ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, సుఖశాంతులు, ధనధాన్య సమృద్ధి కలగాలని ఆలయ ట్రస్ట్ ఆకాంక్షించింది. మహోత్సవాన్ని విజయవంతం చేసిన భక్తులు, దాతలు, స్వచ్ఛంద సేవకులు, అర్చకులు, ఆలయ సిబ్బంది, పోలీసు శాఖ, మీడియా ప్రతినిధులకు ట్రస్ట్ చైర్మన్ కందాడి హనుమంత్ రెడ్డి, ట్రస్ట్ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమం సందర్భంగా ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిసి ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి.