prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 08 July 2026, 5:35 pm Digital Edition : PRAJA KSHETRAM

ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో కొమ్మిడి నర్సింహారెడ్డి అంత్యక్రియలు

ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో కొమ్మిడి నర్సింహారెడ్డి అంత్యక్రియలు

  • భువనగిరి ఎమ్మెల్యేగా రెండు సార్లు ఎన్నికైన నర్సింహారెడ్డి
  • తన వందలాది ఎకరాల భూమిని పేదలకు రాసిచ్చిన గొప్ప దాత
  • స్వగ్రామమైన బీబీనగర్ మండలం బ్రాహ్మణపల్లిలో అంత్యక్రియలు

యాదాద్రి భువనగిరి జులై 08(ప్రజాక్షేత్రం):రెండుసార్లు ఎమ్మెల్యేగా చేసినా సొంత ఇల్లు, కారు కూడా లేకుండా కేవలం ఒక పాత స్కూటర్‌తో సాధారణ జీవితం గడిపిన అసలు సిసలైన ‘ప్రజల మనిషి’, కాంగ్రెస్ సీనియర్ నేత కొమ్మిడి నర్సింహారెడ్డికి తెలంగాణ ప్రభుత్వం అత్యున్నత గౌరవం కల్పించింది. భువనగిరి మాజీ ఎమ్మెల్యే అయిన నర్సింహారెడ్డి నిన్న తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఆయన అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశాల మేరకు జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ అధికారిక ఉత్తర్వులను జారీ చేసింది. రాజకీయాల్లో నీతికి, నిజాయతీకి బ్రాండ్ అంబాసిడర్‌లా బతికిన నర్సింహారెడ్డి లాంటి గొప్ప నిరాడంబర నాయకుడికి ఈ రకమైన గౌరవం దక్కడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. తనకున్న వందలాది ఎకరాల భూమిని పేదలకు రాసిచ్చి ‘భూదాన రెడ్డి’గా పేరు తెచ్చుకున్న ఆయన, చివరి రోజుల్లో అద్దె ఇంట్లో ఉంటూ కన్నుమూశారు.
ఈ అరుదైన ప్రజా నాయకుడికి తుది వీడ్కోలు ఘనంగా పలికేందుకు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, జిల్లా ఎస్పీలకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు జారీ చేశారు. నర్సింహారెడ్డి స్వగ్రామమైన బీబీనగర్ మండలం బ్రాహ్మణపల్లిలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి చేసేందుకు అవసరమైన అన్ని పోలీస్ బందోబస్తు, ఇతర ఏర్పాట్లను యంత్రాంగం చకచకా పూర్తి చేస్తోంది.