prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 12 July 2026, 10:33 pm Digital Edition : PRAJA KSHETRAM

రైస్ మిల్లర్స్ అసోసియేషన్‌కు తొలి మహిళా అధ్యక్షురాలుపెద్దమారు ధనలక్ష్మి

రైస్ మిల్లర్స్ అసోసియేషన్‌కు తొలి మహిళా అధ్యక్షురాలుపెద్దమారు ధనలక్ష్మి

  • 127 ఓట్లలో 81 ఓట్లతో ఘన విజయం
  • నూతన కమిటీని సత్కరించిన ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి
  • మిల్లర్ల సమస్యల పరిష్కారమే తొలి ప్రాధాన్యత

ధనలక్ష్మి

వనపర్తి, జూలై 12(ప్రజాక్షేత్రం):వనపర్తి జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలిగా వనపర్తి పట్టణ 21వ వార్డు కౌన్సిలర్ పెద్దమారు ధనలక్ష్మి ఘన విజయం సాధించారు. ఆదివారం జరిగిన అసోసియేషన్ ఎన్నికల్లో మొత్తం 127 ఓట్లు పోలవగా, అందులో 81 ఓట్లను సొంతం చేసుకుని అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. మిల్లర్ల విశ్వాసాన్ని పొందుతూ స్పష్టమైన మెజారిటీతో విజయం సాధించిన ధనలక్ష్మికి జిల్లా వ్యాప్తంగా రైస్ మిల్లర్లు, ప్రజాప్రతినిధులు, వివిధ వర్గాల నాయకులు అభినందనలు తెలిపారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం నూతన అధ్యక్షురాలు పెద్దమారు ధనలక్ష్మితో పాటు అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులు వనపర్తిలోని నంది హిల్స్‌లో ఉన్న ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి నివాస కార్యాలయాన్ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి నూతన కమిటీ సభ్యులను శాలువాలతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. రైస్ మిల్లింగ్ రంగం జిల్లా వ్యవసాయ ఆర్థిక వ్యవస్థకు కీలకమైందని, మిల్లర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. నూతన కమిటీ సభ్యులు ఐకమత్యంతో పనిచేసి అసోసియేషన్‌ను మరింత బలోపేతం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా అధ్యక్షురాలు పెద్దమారు ధనలక్ష్మి మాట్లాడుతూ, తనపై విశ్వాసం ఉంచి అత్యధిక మెజారిటీతో గెలిపించిన జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సభ్యులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. సభ్యుల సంక్షేమమే తన ప్రధాన లక్ష్యమని, మిల్లర్లు ఎదుర్కొంటున్న విద్యుత్, ధాన్యం సేకరణ, రవాణా, చెల్లింపులు, ప్రభుత్వ విధానాలకు సంబంధించిన సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తానని పేర్కొన్నారు. అసోసియేషన్ బలోపేతానికి ప్రతి సభ్యుడి సహకారం అవసరమని, అందరినీ కలుపుకుని పారదర్శకంగా వ్యవహరిస్తూ మిల్లర్ల ప్రయోజనాలను కాపాడే విధంగా కార్యాచరణ చేపడతామని ఆమె తెలిపారు. సభ్యుల మధ్య ఐక్యతను పెంపొందించి, ప్రభుత్వంతో సమన్వయం సాధిస్తూ రైస్ మిల్లింగ్ రంగ అభివృద్ధికి కృషి చేస్తామని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులు, ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, రైస్ మిల్లర్లు, వ్యాపారవేత్తలు, అభిమానులు తదితరులు పాల్గొని నూతన అధ్యక్షురాలు పెద్దమారు ధనలక్ష్మికి శుభాకాంక్షలు తెలియజేశారు.