prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 30 July 2026, 5:27 pm Digital Edition : PRAJA KSHETRAM

వర్షంలో మహిళ.. సిగ్నల్ వద్ద డోర్ తీయని బస్సు డ్రైవర్..

వర్షంలో మహిళ.. సిగ్నల్ వద్ద డోర్ తీయని బస్సు డ్రైవర్..

  • హైదరాబాద్‌లో టీజీఎస్ఆర్టీసీ డ్రైవర్ తీరుపై మిశ్రమ స్పందన
  • వర్షంలో తడుస్తూ డోర్ తీయాలని కోరిన మహిళ
  • ట్రాఫిక్ సిగ్నల్ వద్ద బస్సు డోర్ తీసేందుకు డ్రైవర్ నిరాకరణ
  • ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్

హైదరాబాద్ జులై 30(ప్రజాక్షేత్రం):హైదరాబాద్‌లో టీజీఎస్ఆర్టీసీ బస్సు డ్రైవర్ వ్యవహరించిన తీరు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశమైంది. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద వర్షంలో తడుస్తూ బస్సు ఎక్కేందుకు ప్రయత్నించిన ఒక మహిళ పట్ల డ్రైవర్ స్పందించిన విధానంపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. నగరంలోని ప్యారడైజ్ సిగ్నల్ వద్ద ఈ ఉదంతం చోటుచేసుకుంది. వర్షం కురుస్తున్న సమయంలో, సిగ్నల్ వద్ద ఆగి ఉన్న ఆర్టీసీ బస్సు తలుపులు తీయాలని ఒక మహిళ డ్రైవర్‌ను అభ్యర్థించింది. బస్సులోని ఇతర ప్రయాణికులు సైతం ఆమెను లోపలికి అనుమతించాలని కోరినప్పటికీ, డ్రైవర్‌ మాత్రం తలుపు తీసేందుకు నిరాకరించారు. ఈ దృశ్యాలను ఎవరో చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. “వర్షంలో తడుస్తున్న మహిళ పట్ల కనీస మానవత్వం లేకుండా ప్రవర్తించడం సరికాదు” అని కొందరు డ్రైవర్ తీరును తప్పుబడుతుండగా, “అది బస్ స్టాప్ కాదు, నిబంధనల ప్రకారం సిగ్నల్ వద్ద బస్సు ఆపడం నిషిద్ధం, డ్రైవర్ నిబంధనలకే కట్టుబడి తన విధిని నిర్వహించారు” అంటూ మరికొందరు ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు.