సర్ ప్రక్రియతో పాటు ప్రజా సమస్యలపై దృష్టి సారించాలి
పెద్దమందడి మండలంలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి విస్తృత పర్యటన
వనపర్తి, జూలై 18 (ప్రజాక్షేత్రం):ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (సర్) ప్రక్రియలో చురుకుగా పాల్గొంటూనే ప్రజల సమస్యలను గుర్తించి పరిష్కారానికి కృషి చేయాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి బీఆర్ఎస్ శ్రేణులకు సూచించారు. శనివారం పెద్దమందడి మండలంలోని పలు గ్రామాల్లో ఆయన పర్యటించి సర్ కార్యక్రమం అమలును పరిశీలించారు. చిలుకటోనీపల్లి, బలీదుపల్లి, వెల్టూరు, మదిగట్ల, మోజర్ల, చిన్నమందడి, పెద్దమందడి, జగత్పల్లి గ్రామాల్లో ఓటరు జాబితా సవరణ ప్రక్రియను పరిశీలించిన ఆయన, అర్హులైన ప్రతి ఓటరు పేరు తుది జాబితాలో ఉండేలా బీఎల్ఓలు, పార్టీ నాయకులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సర్ కార్యక్రమంలో పాల్గొంటున్న నాయకులు, కార్యకర్తలు గ్రామాల్లో ప్రజలను నేరుగా కలుస్తూ స్థానిక సమస్యలను గుర్తించి తన దృష్టికి తీసుకురావాలని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారమే పార్టీ కార్యకర్తల ప్రధాన బాధ్యతగా భావించాలని సూచించారు.
ఈ పర్యటనలో వాకిటి శ్రీధర్, జగదీశ్వర్ రెడ్డి, రఘుపతి రెడ్డి, వేణు యాదవ్, కుమార్ యాదవ్, అశోక్, సేనాపతి, పురుషోత్తంరెడ్డి, కురుమూర్తి, శ్రీనివాసులు, మొగిలయ్య, వెంకటన్న, ఆంజనేయులు, నరసింహ, హనుమంత్, బాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.