స్కూల్ బస్సును ఢీకొన్న రైలు..ఐదుగురు మృతి
పశ్చిమ బెంగాల్ జులై 17(ప్రజాక్షేత్రం):పశ్చిమ బెంగాల్లో ఘోర ప్రమాదం జరిగింది. ముర్షిదాబాద్లో స్కూల్ బస్సును రైలు ఢీకొట్టిన ఘటనలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. వీరిలో ఇద్దరు విద్యార్థులున్నారు. మరికొందరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం ఉదయం ఈ సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు శుక్రవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో ఓ స్కూల్ బస్సు కర్ణసుబర్ణ రైల్వే క్రాసింగ్ దగ్గర పట్టాలు దాటుతుండగా ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో బస్సు పెద్ద మొత్తంలో ధ్వంసం అయిపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి సహాయక చర్యలు చేపట్టారని వివరించారు. లోపల చిక్కుకుపోయిన విద్యార్థులను బయటకు తీసి ముర్షిదాబాద్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్కు తరలించారు. ఈ ఘటనపై ప్రత్యక్ష సాక్షి ఒకరు మాట్లాడుతూ ‘ప్రమాదం జరిగిన సమయంలో రైలు గేట్లు తెరిచి ఉన్నాయి. బస్సు పట్టాలు దాటుతుండగా ఒక్కసారిగా రైలు వచ్చి ఢీకొట్టింది’ అని అన్నారు. రైల్వే శాఖ ప్రాథమిక విచారణలో కూడా ఇదే బయటపడింది. రైల్వే గేట్మెన్ నిర్లక్షం కారణంగానే దుర్ఘటన చోటుచేసుకుందని అధికారులు తెలిపారు. అతన్ని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.