108 అంబులెన్స్ లో సురక్షిత ప్రసవం….
తల్లి,బిడ్డ క్షేమం
- 108 అంబులెన్స్ లో మగ బిడ్డకు జన్మనిచ్చిన కొండాపూర్ గ్రామానికి చెందిన గర్భిణీ స్త్రీ సోను (24)
- గర్భిణీ స్త్రీ ప్రసవ వేదనలో అప్రమత్తంగా వ్యవహారించిన 108 ఈఎంటీ ఎం.సంజీవ్, పైలట్ ఎ.మహేష్
పెద్దేముల్, జులై 03(ప్రజాక్షేత్రం):అత్యవసర పరిస్థితుల్లో 108 అంబులెన్స్ సిబ్బంది సమయస్ఫూర్తితో స్పందించి మరోసారి ఓ గర్భిణికి సురక్షిత ప్రసవం నిర్వహించి ప్రాణాలను కాపాడారు.వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలోని పెద్దేముల్ మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన సోను (24) అనే గర్భిణి ప్రసవ వేదనతో బాధపడుతుండగా కుటుంబ సభ్యులు వెంటనే 108 అంబులెన్స్కు సమాచారం అందించారు.అంబులెన్స్ హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని ఆమెను తాండూరు మాతా-శిశు ఆసుపత్రికి (ఎంసీహెచ్) తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రసవ వేదనలు తీవ్రం కావడంతో అంబులెన్స్లోనే ప్రసవం నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఈ సందర్భంగా 108 ఈఎంటీ ఎం.సంజీవ్ అప్రమత్తంగా వ్యవహరించి అవసరమైన వైద్య సేవలు అందించగా,పైలట్ ఎ.మహేష్ సమయానికి ఆసుపత్రికి చేర్చేందుకు సహకరించారు. అంబులెన్స్లోనే గర్భిణి సురక్షితంగా మగ శిశువుకు జన్మనిచ్చింది.శిశువు జనన సమయం సాయంత్రం 4:30 గంటలకు నమోదైంది.అనంతరం తల్లి, నవజాత శిశువును తాండూరు మాతా-శిశు ఆసుపత్రికి తరలించి వైద్యుల పర్యవేక్షణలో చేర్పించారు.ప్రస్తుతం తల్లి, శిశువు ఇద్దరు క్షేమంగా ఉన్నట్లు వైద్య సిబ్బంది తెలిపారు.ఈ సేవలో ఈఆర్సీపీ డాక్టర్ మనీష్ వైద్య పర్యవేక్షణ అందించగా,108 సిబ్బంది చూపిన సమయస్ఫూర్తి, సేవాభావాన్ని స్థానికులు,కుటుంబ సభ్యులు అభినందించారు.అత్యవసర పరిస్థితుల్లో 108 అంబులెన్స్ సేవలు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని వారు పేర్కొన్నారు.