prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 18 August 2026, 1:40 am Digital Edition : PRAJA KSHETRAM

ఖర్గేను అవమానించిన బీజేపీ క్షమాపణ చెప్పాలి

ఖర్గేను అవమానించిన బీజేపీ క్షమాపణ చెప్పాలి

  • బాధ్యులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి
  • కాంగ్రెస్‌ ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు రాజ్‌కుమార్‌ డిమాండ్‌

వనపర్తి, ఆగస్టు 17(ప్రజాక్షేత్రం):కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను అవమానించిన ఘటనపై బీజేపీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్‌ ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు రాజ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలని కోరారు.
కాంగ్రెస్‌ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడి ఆదేశాల మేరకు, డీసీసీ అధ్యక్షుడు శివసేనారెడ్డి, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జి. చిన్నారెడ్డి పిలుపుతో సోమవారం వనపర్తి అంబేద్కర్‌ చౌక్‌లో సత్యాగ్రహం నిర్వహించారు. ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు రాజ్‌కుమార్‌ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ నాయకులు అంబేద్కర్‌ విగ్రహం ఎదుట రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రాజ్‌కుమార్‌ మాట్లాడుతూ రాజ్యాంగ విలువలను కాపాడాల్సిన బీజేపీ నిరంకుశ ధోరణితో వ్యవహరిస్తోందని విమర్శించారు. కుల, మత రాజకీయాలకు పాల్పడుతూ దళితులను అణగదొక్కే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. బీజేపీలోని దళిత నాయకులు, కార్యకర్తలు ఎదగకుండా అడ్డుకుంటున్నారని విమర్శించారు. మల్లికార్జున ఖర్గేను అవమానించిన ఘటనను కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. ఘటనకు కారకులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. బీజేపీ నాయకత్వం ఖర్గేకు బేషరతుగా క్షమాపణ చెప్పే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
కార్యక్రమంలో ఎస్సీ విభాగం రాష్ట్ర కార్యదర్శి కె. వెంకటేష్‌, కొత్తకోట మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ప్రశాంత్‌, కౌన్సిలర్‌ బోహెజ్‌, కాంగ్రెస్‌ జిల్లా అధికార ప్రతినిధి కోళ్ల వెంకటేష్‌, బి. కృష్ణ, యువజన కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు ఆదిత్య, పట్టణ అధ్యక్షుడు కదిరే రాములు, పెద్దమందడి మండల అధ్యక్షుడు వెంకటస్వామి, సుభాష్‌, స్వామి, రవి, స్వప్నతో పాటు కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు, ఎస్సీ విభాగం నాయకులు పాల్గొన్నారు.