డీసీఎం ఢీకొని దంపతుల దుర్మరణం
జహీరాబాద్ ఆగస్టు 27(ప్రజాక్షేత్రం):పరిధిలోని బడంపేట్ శివారులో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా, అజాగ్రత్తగా వచ్చిన డీసీఎం వ్యాన్ ఆటోను ఢీకొనడంతో దంపతులు మృతి చెందారు. బడంపేట్కు చెందిన బేగరి రామయ్య (48), పద్మమ్మ (40) బతుకుదెరువు కోసం జహీరాబాద్లో నివాసముంటున్నారు. గురువారం ఉదయం సుమారు 9.30 గంటలకు ఆటోలో జహీరాబాద్ నుంచి బడంపేట్కు వెళ్తుండగా ఎదురుగా వచ్చిన డీసీఎం (AP15 Y 0725) ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో నుజ్జునుజ్జుకాగా, రామయ్య, పద్మమ్మ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే 108 అంబులెన్స్ వారిని జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దంపతుల మృతితో వారి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.