prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 18 August 2026, 1:43 am Digital Edition : PRAJA KSHETRAM

నాగేష్ కుటుంబానికి నిరంజన్‌రెడ్డి పరామర్శ

నాగేష్ కుటుంబానికి నిరంజన్‌రెడ్డి పరామర్శ

  • మృతదేహానికి నివాళి.. కుటుంబానికి ఆర్థిక సాయం
  • శుభకార్యాల్లో పాల్గొని నూతన దంపతులకు ఆశీస్సులు

వనపర్తి, ఆగస్టు 17(ప్రజాక్షేత్రం):మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నాయకుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి సోమవారం వనపర్తి మండలంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన బీఆర్‌ఎస్‌ కార్యకర్త నాగేష్‌ కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం అందించారు. అనంతరం పలు శుభకార్యాలకు హాజరై కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. వనపర్తి మండలం కాశీంనగర్‌ ఎద్దులగిరి గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్‌ కార్యకర్త నాగేష్‌ రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన విషయం తెలుసుకున్న నిరంజన్‌రెడ్డి ఆయన నివాసానికి వెళ్లారు. మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. రూ.5 వేల ఆర్థిక సాయం అందించారు. నాగేష్‌ ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు. అనంతరం వనపర్తి మండలం తూర్పుతండా మాజీ సర్పంచ్‌ లక్ష్మణ్‌నాయక్‌ సోదరుడు టి.కె. నాయక్‌ నూతన గృహప్రవేశ కార్యక్రమానికి హాజరై కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే కాశీంనగర్‌ ఎర్రగడ్డతండాకు చెందిన రాత్లావత్‌ శాంతమ్మ, బాబు నాయక్‌ దంపతుల కుమారుడు వంశీకృష్ణ, కావేరిముత్యాలి వివాహం ఇటీవల జరగడంతో వారి నివాసానికి వెళ్లి నూతన దంపతులను అక్షింతలు వేసి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆయా కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా మాట్లాడి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమాల్లో బీఆర్‌ఎస్‌ జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్‌, మండల పార్టీ అధ్యక్షుడు కే. మాణిక్యం, మాజీ సర్పంచ్‌ భాను ప్రకాష్‌రావు, మాజీ జెడ్పీటీసీ ధర్మనాయక్‌, నాయకులు మాధవరెడ్డి, శంకర్‌నాయక్‌, చిట్యాల రాము, గోపాల్‌నాయక్‌, సక్రునాయక్‌, శివకుమార్‌, సర్పంచ్‌ రాజమ్మ, గోవిందునాయక్‌, రాము, మహేష్‌, రాములు, చిన్న, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.