prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 16 August 2026, 6:39 am Digital Edition : PRAJA KSHETRAM

పంచాయతీ కార్యదర్శిపై దాడి చేసిన నిందితులను అరెస్ట్ చేయాలి

పంచాయతీ కార్యదర్శిపై దాడి చేసిన నిందితులను అరెస్ట్ చేయాలి

  • ఎంపీడీఓకీ వినతి పత్రం అందించిన ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు
  • ఉద్యోగుల భద్రతకు రక్షణ కల్పించాలి
  • తోటి ఉద్యోగికి అండగా నిలిచిన పంచాయతీ కార్యదర్శులు
  • అరెస్ట్ చేసే వరకు విధులకు దూరంగా ఉంటామని హెచ్చరిక
  • మల్లేష్ పై దాడి చేసిన వ్యక్తులను వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించాలి
  • తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కోఆర్డినేటర్ లాలప్ప

పెద్దేముల్, ఆగస్టు 15 (ప్రజాక్షేత్రం)

పంచాయతీ కార్యదర్శి మల్లేష్‌పై దాడికి పాల్పడిన వ్యక్తులను వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించాలని తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల ఫోరమ్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కోఆర్డినేటర్ లాలప్ప డిమాండ్ చేశారు.శనివారం పెద్దేముల్ మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో మండల పరిధిలోని వివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శులతో కలిసి ఎంపీడీఓ కే.తిరుమల స్వామికి వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా పలువురు పంచాయతీ కార్యదర్శులు మాట్లాడుతూ..శుక్రవారం (ఆగస్టు 14) సాయంత్రం సుమారు 6 గంటల సమయంలో మండల ఎంపీడీఓ ఛాంబర్‌లో ఎంపీడీఓ కే.తిరుమల స్వామి, ఎంపీఓ రతన్ సింగ్ సమక్షంలో జయరాంతాండ పంచాయతీ కార్యదర్శి మల్లేష్‌పై కందనెల్లి తాండ గ్రామ సర్పంచ్, ఆయన కుమారుడు దాడి చేసినట్లు ఆరోపించారు.ఈ ఘటనపై అదే రోజు రాత్రి సుమారు 8 గంటల సమయంలో పెద్దేముల్ పోలీస్ స్టేషన్‌లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.అయితే శనివారం సాయంత్రం వరకు దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేయకపోవడంపై వారు ఆవేదన వ్యక్తం చేశారు.విధులు నిర్వహిస్తున్న ఉద్యోగిపై కార్యాలయంలోనే దాడి జరగడం తీవ్ర ఆందోళన కలిగించే విషయమని పేర్కొన్నారు.ఒక ఉద్యోగిపై దాడి జరిగితే భవిష్యత్తులో తమపై కూడా ఇలాంటి ఘటనలు జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

నిందితులను అరెస్ట్ చేసే వరకు విధులకు దూరం

తమ తోటి ఉద్యోగి,పంచాయతీ కార్యదర్శి మల్లేష్‌పై దాడికి పాల్పడిన వ్యక్తులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుని, వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించే వరకు మండల పరిధిలోని గ్రామ పంచాయతీలలో విధులకు హాజరుకాబోమని ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు హెచ్చరించారు.ఉద్యోగుల భద్రతకు ప్రభుత్వం, పోలీసు శాఖ తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.కార్యాలయాల్లో విధులు నిర్వహించే ప్రభుత్వ ఉద్యోగులపై దాడులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించరాదని, ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో మండల పరిషత్ సూపరింటెండెంట్ వెంకట కృష్ణ,మండల పరిధిలోని ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, ఇతర సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.