పాలమూరు పల్లె జానపదం.. జల్లుమన్న జానపద గానం
- ఒకే వేదికపై 50 మంది కళాకారులు..
- కనుమరుగవుతున్న పల్లె పాటలకు పునర్జీవం
వనపర్తి, ఆగస్టు 23(ప్రజాక్షేత్రం):వనపర్తి జిల్లా కేంద్రంలోని ఎంఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో ఆదివారం నిర్వహించిన ‘పాలమూరు పల్లె జానపదం–ఆడుదాం.. పాడుదాం’ కార్యక్రమం అలరించింది. అక్షయ్ రికార్డింగ్ స్టూడియో, పాలమూరు పల్లె జానపదం స్టూడియో ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి నిర్వాహకులు మీసాల రామన్న, చీర్ల నాగేంద్రసాగర్, ఉందే కోటి కృష్ణయ్య నేతృత్వం వహించారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో కనుమరుగవుతున్న పల్లె పాటలను పరిరక్షించడంతోపాటు కళాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఉమ్మడి జిల్లాకు చెందిన సుమారు 50 మంది కళాకారులు ఒకే వేదికపై జానపద, సామాజిక గీతాలను ఆలపించి ప్రేక్షకులను అలరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనజ్వాల ప్రజాకవి రాధాకృష్ణ, సీనియర్ రిపోర్టర్ మల్యాల బాలస్వామి హాజరై కళాకారులను అభినందించారు. పల్లె జీవన విధానం, సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే జానపద గీతాలను కళాకారులు ఆలపించడంతో ఫంక్షన్ హాల్ పల్లె వాతావరణాన్ని తలపించింది. ఉమ్మడి జిల్లా నుంచి మహిళా కళాకారులు సహా పెద్ద సంఖ్యలో కళాకారులు, జానపద కళాభిమానులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. పల్లె పాటలకు ఆదరణ పెంచేందుకు, మరుగునపడుతున్న జానపద కళలకు వేదిక కల్పించేందుకు ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలని నిర్వాహకులు తెలిపారు.